Kanna Lakshminarayana: ఏపీలో హిందూ మతంపై విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నాయి: కన్నా

  • గత ప్రభుత్వం దేవాలయాలను కూలగొట్టింది
  • వైసీపీ అధికారంలోకి వచ్చాక హిందూ మతంపై దాడులు పెరిగాయి
  • దోషులను పక్కన పెట్టి ఉద్యోగులను సస్పెండ్ చేస్తున్నారు
Attacks on Hindu is increasing in AP says Kanna Lakshminarayana

పిఠాపురంలో హిందూ దేవుళ్ల విగ్రహాలు ధ్వంసం కావడం, అంతర్వేదిలో  స్వామివారి రథం అగ్నికి ఆహుతి కావడం వంటి ఘటనలు కలకలం రేపుతున్నాయి. రాజకీయ విమర్శలకు తావిస్తున్నాయి.

తాజాగా బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ టీడీపీ, వైసీపీలపై మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో దేవాలయాలను కూల్చేశారని... వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ మతంపై విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నాయని చెప్పారు. అంతర్వేది ఘటన మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన పని అని చెప్పడం దారుణమని... మతిస్థిమితం లేని వ్యక్తి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన ఘటన ఎక్కడా లేదని అన్నారు.

అసలైన దోషులను పట్టుకోకుండా ఉద్యోగులను సస్పెండ్ చేస్తున్నారని కన్నా మండిపడ్డారు. అసలు దోషులను పక్కన పెట్టేందుకే ఇలాంటి పనులు చేస్తున్నారని అన్నారు. నిరసన వ్యక్తం చేస్తున్న బీజేపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వం హయాంలో కూలగొట్టిన దేవాలయాలను ప్రస్తుత ప్రభుత్వం నిర్మించాలని డిమాండ్ చేశారు.

More Telugu News