Swapna: ఐసీయూలో కేరళ గోల్డ్ స్మగ్లింగ్ స్కామ్ నిందితురాలు స్వప్న!

  • ప్రస్తుతం వయ్యూర్ సెంట్రల్ జైల్లో స్వప్న
  • గుండెలో నొప్పిగా ఉందనడంతో ఆసుపత్రికి
  • అరబ్ దేశాల నుంచి భారీ ఎత్తున బంగారం తెప్పించిన స్వప్న
Kerala Gold Scam Accused Swapna in ICU

కేరళలో తీవ్ర సంచలనం రేపిన బంగారం స్మగ్లింగ్ కుంభకోణంలో ప్రధాన నిందితురాలైన స్వప్నా సురేశ్, ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఆమె తన గుండెల్లో నొప్పిగా ఉందని చెప్పడంతో త్రిసూర్ లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీకి తరలించామని, ఆ వెంటనే ఆమెను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చేర్పించి చికిత్స ప్రారంభించామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం స్వప్న, త్రిసూర్ జిల్లాలోని వయ్యూర్ కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉందన్న సంగతి తెలిసిందే.

స్వప్నను పరీక్షించిన వైద్యులు, ఆమె ఈసీజీ రిపోర్ట్ ను చూసిన తరువాత తేడా ఉందని గమనించినట్టు చెప్పడంతో, ఆమెను ఆసుపత్రిలో చేర్చామని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి సంతృప్తికరంగానే ఉందని జీఎంసీ అధికారులు వెల్లడించారు. కాగా, స్వప్నపై ఫోర్జరీ నుంచి తప్పుడు డిగ్రీ సర్టిఫికెట్లను సృష్టించిన ఆరోపణల వరకూ పలు కేసులు నమోదయ్యాయి. కేరళ ప్రభుత్వ ఆదాయపు పన్ను శాఖలో ఉద్యొోగం కోసం ఆమె, కేఎస్ఐటీఐఎల్ (కేరళ స్టేట్ ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్ లిమిటెడ్) నుంచి తప్పుడు ధ్రువపత్రాలను పొందిందన్న అభియోగాలూ ఉన్నాయి.

ఆపై దౌత్య కార్యాలయంలో జాబ్ సంపాదించిన స్వప్న, ఉన్నతాధికారులతో పరిచయం పెంచుకుని, బంగారాన్ని అరబ్ దేశాల నుంచి అక్రమంగా తెప్పించినట్టు ఇప్పటికే పోలీసులు, కేరళ అధికారులు సాక్ష్యాలను సంపాదించగా, ఆమెను గత నెలలోనే అరెస్ట్ చేశారు. మొత్తం 14.82 కోట్ల విలువైన 30 కేజీల బంగారాన్ని ఆమె దేశంలోకి తెప్పించినట్టు పోలీసులు సాక్ష్యాలు సేకరించారు. ఈ కేసు జూలై 5న తొలిసారిగా అరబ్ దేశాల నుంచి వచ్చిన ఓ దౌత్యాధికారుల బ్యాగేజిని కస్టమ్స్ అధికారులు పరీక్షించగా, తిరువనంతపురంలో వెలుగులోకి వచ్చింది.

More Telugu News