Raghurama Krishnaraju: మీకు హిందూ పురాణాలు తెలియవు... అసలు మీ పాలసీ ఏంటి?: రఘురామకృష్ణరాజు

Narasapur MP Raghurama Krishnaraju questions CM Jagan and YCP Govt over Antarvedi incident
  • అంతర్వేది ఘటనపై రఘురామ స్పందన
  • హిందూ దేవాలయాలంటే మీకు లెక్కలేదంటూ ఆగ్రహం
  • ఒక మతంపై దాడి జరుగుతుంటే ఏంచేస్తున్నారంటూ వ్యాఖ్యలు
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం అగ్నికి ఆహుతైన ఘటన ఓ కుట్రలా అనిపిస్తోందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. అంతర్వేది ఘటనలో ఏం చర్యలు తీసుకున్నారంటూ సీఎం జగన్ ను, వైసీపీ సర్కారును ప్రశ్నించారు. రథాన్ని ఎవరు తగులబెట్టారో తేల్చాలని డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనుకాడుతున్నారంటూ ప్రశ్నించారు. సీఎం జగన్ ను ప్రసన్నం చేసుకోవడానికి కొందరు వైసీపీ నేతలు పిచ్చిగా మాట్లాడుతున్నారని విమర్శించారు.

"రెండు దేవాలయాలకు కలిపి ఒకే ఈవోను నియమిస్తారా? హిందూ దేవాలయాలంటే మీకు లెక్కలేదా? మీకు హిందూ పురాణాలు తెలియవు... అసలు మీ పాలసీ ఏంటి? ఒక మతం మీద దాడి జరుగుతుంటే ఏంచేస్తున్నారు? మీ విధానం ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నా. అంతర్వేదిలో సీసీ కెమెరాలు పనిచేయడంలేదని తెలిసింది. చర్యలు తీసుకోవాలని చెప్పిన వాళ్లు మీ మంత్రులకు పిచ్చివాళ్లలా కనిపిస్తున్నారు. రథం ఘటనపై దేవాదాయ శాఖ అధికారులను విచారణ చేయమని చెప్పడమేంటి?" అంటూ ధ్వజమెత్తారు.

అంతేగాకుండా, సీఎం జగన్ ప్రారంభించిన వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం గురించి కూడా రఘురామకృష్ణరాజు స్పందించారు. గోరుముద్ద పథకానికే సంపూర్ణ పోషణ అని పేరుపెట్టారని తెలిపారు. కేంద్రం నుంచి సకాలంలో నిధులు రావాలంటే ప్రభుత్వ ప్రకటనల్లో కేంద్రం పేరు కూడా చేర్చితే బాగుండేదని హితవు పలికారు.

ఇక ఏపీ మద్యం విధానంపైనా విమర్శలు చేశారు. కాలం చెల్లిన బీర్లు అమ్ముతూ ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలం చెల్లిన బీర్లకు మళ్లీ టెస్టులు చేయడం ఏంటని ప్రశ్నించారు. పిచ్చి బ్రాండ్ల మద్యాన్ని తొలగించి, రూ.190 పైన ఉన్న మద్యం బ్రాండ్లను తక్కువ ధరకి అందించాలని సూచించారు.
Raghurama Krishnaraju
Antarvedi
Chariot
Burning
Jagan
YSRCP

More Telugu News