YS Jagan: కరోనా బాధితులకు ‘ఆసరా’ నిలిపివేసిన ఏపీ ప్రభుత్వం

  • కరోనా నుంచి కోలుకున్నాక బలవర్థకమైన ఆహారం కోసం రూ. 2 వేల ఆర్థిక సాయం
  • ఇప్పటి వరకు రూ. 20 కోట్ల చెల్లింపు
  • జులై నుంచి నిలిచిపోయిన చెల్లింపులు
AP Govt stopped Aasara to covid patients

కరోనా బారినపడి కోలుకుంటున్న వారికి ‘ఆసరా’ పథకం కింద ఇచ్చే రూ. 2 వేల ఆర్థిక సాయాన్ని ఏపీ ప్రభుత్వం నిలిపివేసింది. పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో ప్రభుత్వంపై ఆర్థికభారం పెరిగిందని, దీంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు తాత్కాలికంగా ‘ఆసరా’ను నిలిపివేసినట్టు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. కొవిడ్ నుంచి కోలుకున్న అనంతరం రెండు వారాలపాటు ఇంట్లోనే ఉండి బలవర్థకమైన ఆహారం తీసుకునే ఉద్దేశంతో ఏప్రిల్ నెలాఖరులో ప్రభుత్వం ప్రతి ఒక్కరికి రూ. 2వేల ఆర్థికసాయాన్ని ప్రకటించింది. ఇందుకోసం మే 4న వైద్య ఆరోగ్య శాఖకు రూ. 10 కోట్లు మంజూరు చేసింది. ఆ వెంటనే బాధితులకు చెల్లింపుల కూడా చేశారు. అలా మొత్తం రూ. 20 కోట్లు చెల్లించారు.

అయితే, జులై నుంచి మాత్రం ఈ చెల్లింపులు నిలిపివేశారు. మరోవైపు క్వారంటైన్ కేంద్రాలు తగ్గి కోవిడ్ సంరక్షణ కేంద్రాలు పెరిగాయి. హోం క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నవారు పెరిగారు. దీంతో ఆసరా ఆర్థిక సాయాన్ని నిలిపివేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ఆదేశాలతో గత నాలుగు రోజులుగా ఆసరా చెల్లింపులు చేయడం లేదని అనంతపురం జిల్లా కలెక్టర్ చెప్పినట్టు జిల్లా సమాచారశాఖ అధికారులు తెలిపారు.

బాధితుల కోసం ఆసుపత్రులు, కొవిడ్ కేర్ సెంటర్లలో నాణ్యత కలిగిన భోజనాన్ని పంపిణీ చేస్తున్నామని, పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపరచడంతోపాటు ఇతర సౌకర్యాల కల్పన కోసం అధిక వ్యయం అవుతోందని, అందుకనే రూ. 2 వేల ఆర్థిక సాయాన్ని అందించలేకపోతున్నట్టు అధికారులు చెప్పారు. మరోవైపు, కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు కూడా రూ. 15 వేల ఆర్థికసాయాన్ని చాలా చోట్ల అందించడం లేదని సమాచారం. 

More Telugu News