Hyderabad Metro: తొలి రోజు మియాపూర్-ఎల్బీ నగర్ రూట్‌కే మెట్రో సేవలు పరిమితం.. నాలుగు స్టేషన్లు క్లోజ్!

Hyderabad metro resumes from 7th containment zones will be closed
  • 9 నుంచి అన్ని రూట్లలోనూ అందుబాటులోకి
  • భరత్‌నగర్, మూసాపేట, ముషీరాబాద్, యూసుఫ్‌గూడ స్టేషన్లు మూసివేత
  • స్టేషన్లు, మెట్రో కోచ్‌లలో మార్కింగ్
మరో మూడు రోజుల్లో హైదరాబాద్ మెట్రో పరుగులు పెట్టేందుకు సిద్ధమవుతున్నప్పటికీ తొలి రోజు మాత్రం అన్ని రూట్లలోనూ సేవలు అందుబాటులో ఉండవని హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. తొలి రోజైన ఏడో తేదీన మియాపూర్-ఎల్బీనగర్ రూట్‌లో మెట్రో సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు రైళ్లు నడుస్తాయన్నారు.

ఆ తర్వాతి రోజైన 8న కారిడార్-3లోని నాగోల్-రాయదుర్గం  మధ్య రైళ్లు నడుస్తాయన్నారు. 9న కారిడార్-1, 2,3లో పూర్తిస్థాయిలో సర్వీసులు అందుబాటులోకి వస్తాయని ఎన్వీఎస్ రెడ్డి వివరించారు. కంటైన్మెంట్ జోన్లు అయిన భరత్‌నగర్, మూసాపేట, ముషీరాబాద్, యూసుఫ్‌గూడలలో రైళ్లు ఆగవని, ఆయా స్టేషన్లను మూసివేస్తున్నట్టు చెప్పారు. ప్రతి 5 నిమిషాలకు ఓ రైలు నడుస్తుందన్నారు.

రైలు ప్రయాణికులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని, స్మార్ట్‌కార్డులు, నగదు రహిత పద్ధతిలోనే టికెట్లు విక్రయించనున్నట్టు ఎండీ తెలిపారు. ప్రవేశ మార్గాల వద్ద థర్మల్ స్క్రీనింగ్ ఉంటుందని, శానిటైజర్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. స్టేషన్లు, కోచ్‌లలో భౌతికదూరం పాటించేలా మార్కింగ్‌లు ఉంటాయన్నారు. మాస్క్ ధరించని వారికి జరిమానా తప్పదని హెచ్చరించారు. కరోనా లక్షణాలు లేనివారే ప్రయాణించాలని సూచించారు. అలాగే, వాహన పార్కింగ్ ప్రదేశాలు తెరిచే ఉంటాయని ఎన్వీఎస్ రెడ్డి వివరించారు.
Hyderabad Metro
Miyapur
LB Nagar
NVS Reddy

More Telugu News