Amaravati: మూడు రాజధానుల కేసు.. జగన్ తో పాటు ఇద్దరు మంత్రులకు హైకోర్టు నోటీసులు!

AP High Court serves notices to CM Jagan
  • రాజధానిని తరలిస్తున్నారంటూ అమరావతి రైతుల పిటిషన్
  • టీడీపీ, బీజేపీలకు కూడా లీగల్ నోటీసులు జారీ చేసిన హైకోర్టు
  • సెప్టెంబర్ 21 నుంచి ప్రతి రోజూ విచారణ

మూడు రాజధానులకు సంబంధించిన కేసులో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఊహించని షాకిచ్చింది. ఏకంగా ముఖ్యమంత్రి జగన్ తో పాటు మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలకు నోటీసులు జారీ చేసింది. రాజధానిని అమరావతి నుంచి తరలిస్తున్నారంటూ ఆ ప్రాంత రైతులు హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాదిరి, అధికారంలోకి రాగానే మరో మాదిరి జగన్ మాట మార్చారని పిటిషన్ లో రైతులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఇతర పార్టీలపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇదే విషయమై హైకోర్టులో ఇతరులు కూడా పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లను ఈరోజు హైకోర్టు విచారించింది. అన్ని పిటిషన్లకు కలిపి ఏపీ ప్రభుత్వం కేవలం ఒక్క కౌంటర్ ను మాత్రమే దాఖలు చేయడంపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. ప్రతి పిటిషన్ కు ఒక కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇదే కేసుకు సంబంధించి టీడీపీ, బీజేపీలకు కూడా లీగల్ నోటీసులు జారీ చేసింది.

ఈ అంశంపై సెప్టెంబర్ 21వ తేదీ వరకు స్టేటస్ కోను పొడిగిస్తున్నామని హైకోర్టు తెలిపింది. సెప్టెంబర్ 21 నుంచి ప్రతి రోజూ ఈ పిటిషన్ పై విచారణ జరుపుతామని చెప్పింది. ఈ విచారణను ప్రత్యక్షంగా నిర్వహించాలా? లేదా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నిర్వహించాలా? అనే విషయాన్ని నిర్ణయిస్తామని తెలిపింది.

  • Loading...

More Telugu News