Adar Poonawala: క్లినికల్ ట్రయల్స్ పై రాసేటప్పుడు మీడియా నియంత్రణ పాటించాలి: ఎస్ఐఐ చైర్మన్ అదార్ పూనావాలా

  • 73 రోజుల్లో కొవిషీల్డ్ వ్యాక్సిన్ వస్తోందంటూ కథనాలు
  • క్లినికల్ ట్రయల్స్ ప్రక్రియను వక్రీకరించరాదన్న అదార్ పూనావాలా
  • త్వరలో డేటా వెల్లడిస్తామని వివరణ
SII Chairman Adar Poonawala says media refrain about interim data from clinical trials

ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా తయారుచేసిన కొవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ పై పూణేకు చెందిన సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది. ఎస్ఐఐ నేతృత్వంలో ఇప్పుడు రెండో దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. కాగా, ఈ వ్యాక్సిన్ ను మరికొన్ని రోజుల్లో భారత్ లో ఉచితంగా పంపిణీ చేస్తారంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎస్ఐఐ చైర్మన్ అదార్ పూనావాలా మీడియాకు హితవు పలికారు. కొవిషీల్డ్ వ్యాక్సిన్ పై తాము చేపడుతున్న క్లినికల్ ట్రయల్స్  గురించి వెల్లడవుతున్న మధ్యంతర సమాచారాన్ని ప్రజలకు వెల్లడించే విషయంలో మీడియా సంస్థలు నియంత్రణ పాటించాలని స్పష్టం చేశారు.

ఈ ప్రక్రియను వక్రీకరించే ప్రయత్నం చేయరాదని, ఈ క్లినికల్ ట్రయల్స్ ను గౌరవిద్దామని పిలుపునిచ్చారు. క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొంటున్న వలంటీర్ల ఆరోగ్య పరిస్థితి గురించి రెండు నెలలు వేచి చూద్దామని తెలిపారు. కొవిషీల్డ్ క్లినికల్ ట్రయల్స్ కు సంబంధించిన సమాచారం త్వరలోనే వెల్లడి చేస్తామని అదార్ పూనావాలా ట్విట్టర్ లో పేర్కొన్నారు. 73 రోజుల్లో కొవిషీల్డ్ వ్యాక్సిన్ భారత్ లో అందుబాటులోకి వస్తుందని కొన్నిరోజుల కిందట మీడియాలో ప్రముఖంగా రావడం తెలిసిందే.

More Telugu News