Russia: పెద్ద ఎత్తున వ్యాక్సిన్ ఉత్పత్తికి సహకరించండి: భారత్ కు రష్యా అభ్యర్థన

  • వ్యాక్సిన్ ను భారీ ఎత్తున తయారు చేయాలని అనుకుంటున్నాం
  • అందుకు భారత్ సహకారం తప్పనిసరి
  • రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ సీఈఓ వీ కిరిల్ దిమిత్రేవ్
Russia Wants Indian Support for Vaccine Production

తాము అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ 5ను భారీ ఎత్తున తయారు చేసేందుకు భారత్ సహకరించాలని రష్యా అధికారికంగా అభ్యర్థించింది. ఇండియా తమతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకోవాలని కోరుకుంటున్నామని, అప్పుడే వ్యాక్సిన్ డోస్ లను అధికంగా తయారు చేయగలమని రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ సీఈఓ వీ కిరిల్ దిమిత్రేవ్ వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే తొలి కరోనా వ్యాక్సిన్ ను తాము తయారు చేశామని, అది సమర్థవంతంగా పనిచేస్తోందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.

రష్యాకు చెందిన గమేలియా రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమాలజీ అండ్ మైక్రోబయాలజీ సంస్థ ఆర్డీఐఎఫ్ సహకారంతో దీన్ని తయారుచేసింది. ఈ వ్యాక్సిన్ ను మూడు దశల్లో పరీక్షించి చూశామని ఆ దేశం చెబుతున్నా, ఇంత త్వరగా దీన్ని రిజిస్టర్ చేయడంపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సహా, పలు దేశాల శాస్త్రవేత్తలు అనుమానాలను వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆన్ లైన్ వేదికగా మీడియాతో మాట్లాడిన దిమిత్రేవ్, వ్యాక్సిన్ తయారీ కోసం పలు లాటిన్ అమెరికా, ఆసియా, మధ్య ప్రాచ్య దేశాలు ఆసక్తిని చూపుతున్నాయని అన్నారు.

"వ్యాక్సిన్ ను భారీ ఎత్తున తయారు చేయడం ఇప్పుడు చాలా ముఖ్యం. ప్రస్తుతం మేము ఇండియాతో భాగస్వామ్యాన్ని కోరుతున్నాం. గమేలియా వ్యాక్సిన్ ను భారీగా, అనుకున్న సమయానికి తయారు చేసి ఇవ్వగల సత్తా భారత్ కు ఉంది. డిమాండ్ కు తగ్గట్టుగా వ్యాక్సిన్ ను తయారు చేయాలంటే, ఇండియాలో ఉన్న ఫార్మా కంపెనీలతో భాగస్వామ్యం తప్పనిసరి. ఆ దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నాం" అని అన్నారు. ఇతర దేశాల సహకారం ఉంటేనే వ్యాక్సిన్ మరింత త్వరగా అందరికీ దగ్గరవుతుందని తెలిపారు.

తమ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కేవలం రష్యాలో మాత్రమే జరుగలేదని, యూఏఈ, సౌదీ అరేబియాలోనూ జరుగుతున్నాయని, బహుశా బ్రెజిల్, ఇండియాలోనూ జరుగుతాయని, కనీసం ఐదారు దేశాల్లో ఈ వ్యాక్సిన్ తయారీ దిశగా డీల్స్ కుదుర్చుకోవాలన్నది తమ అభిమతమని తెలిపారు. ఇదే మీడియా సమావేశంలో పాల్గొన్న రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రతినిధి, గమేలియా డైరెక్టర్ అలగ్జాండర్ జింట్ బర్గ్, ఇప్పటివరకూ తమ సంస్థ 20 వేల మందిపై వ్యాక్సిన్ ను ప్రయోగించిందని, ఎవరికీ సైడ్ ఎఫెక్ట్ లు రాలేదని, వారి శరీరాల్లో యాంటీ బాడీలు పెరిగాయని, ఈ వ్యాక్సిన్ సురక్షితమైనదని అన్నారు.

  • Loading...

More Telugu News