IPL: 'డ్రీమ్ 11'కు చైనా కంపెనీతో ఆర్థిక సంబంధాలు... మొదలైన కొత్త వివాదం!

  • ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ గా డ్రీమ్ 11
  • డ్రీమ్ 11లో టెన్సెంట్ హోల్డింగ్స్ పెట్టుబడులు
  • బీసీసీఐపై విమర్శల వెల్లువ
Contraversy on Dream 11 over IPL Sponsership

ఈ సంవత్సరం ఐపీఎల్ హక్కులను ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్ ఫామ్ 'డ్రీమ్ 11' సొంతం చేసుకుందో, లేదో అప్పుడే నెట్టింట వివాదం మొదలైంది. డ్రీమ్ 11తో చైనాకు చెందిన సెర్చింజన్ దిగ్గజం టెన్సెంట్ హోల్డింగ్స్ తో సంబంధాలు ఉన్నాయని, ఆ సంస్థను ఎలా ఎంచుకుంటారని పలువురు ప్రశ్నిస్తున్నారు. డ్రీమ్ 11 సంస్థ దేశీయ సంస్థే అయినప్పటికీ, ఈ కంపెనీలో టెన్సెంట్ హోల్డింగ్స్ పెట్టుబడులు ఉండటమే ఇందుకు కారణం.

కాగా, ఇండియా, చైనాల మధ్య సరిహద్దు వివాదం ప్రారంభమైన తరువాత, చైనాకు చెందిన ఉత్పత్తులను నిషేధించాలని ఉద్యమం ప్రారంభం కావడం, ఆపై పలు చైనా యాప్ లను నిషేధించడం, చైనా సంస్థలు ఇండియాలో చేస్తున్న కాంట్రాక్టులను రద్దు చేసుకోవడం వంటి పరిణామాలు జరిగిన నేపథ్యంలో, ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ వివో, తప్పుకుంటున్నట్టు ప్రకటించింది.

దీంతో మరో టైటిల్ స్పాన్సర్ కోసం బీసీసీఐ బిడ్లను ఆహ్వానించగా, డ్రీమ్ 11తో పాటు టాటా సన్స్, బైజూస్, పతంజలి వంటి కంపెనీలు దరఖాస్తు చేశాయి. మిగతా సంస్థలతో పోలిస్తే, డ్రీమ్ 11 అధిక బిడ్ ను దాఖలు చేసి ఈ ఏటికి ఐపీఎల్ స్పాన్సర్ గా హక్కులను పొందింది. ఆ కంపెనీకి కూడా చైనాతో సంబంధాలు ఉన్నాయని, వివోను వదిలేసిన వేళ, ఈ సంస్థకు ప్రోత్సాహం ఎందుకని బీసీసీఐపై నెటిజన్లు ఇప్పుడు మండిపడుతున్నారు.

More Telugu News