Psycho Raju: సైకో రాజు నుంచి ఆసక్తికర వివరాలు రాబట్టిన విశాఖ పోలీసులు

  • విశాఖలో సైకో కలకలం
  • ఇంట్లో పుర్రెకు పూజలు
  • హడలిపోతున్న స్థానికులు
Police registered case over Psycho Raju in Vizag

విశాఖలో రావులపూడి రాజు అనే సైకో పుర్రెతో సృష్టించిన కలకలం అంతాఇంతా కాదు. పాతనగరం రెల్లివీధిలో నివసించే రాజు ఇంట్లో ఒక్కడే నివసిస్తూ వ్యసనాలకు బానిసై ఇరుగుపొరుగు వారిలో భయాందోళనలు కలిగిస్తున్నాడు. నిన్న అతడి ఇంటి ముందు పడివున్న సంచిని ఓ వ్యక్తి కర్రతో కదిలించగా అందులోంచి పుర్రె బయటపడింది. ఆ పుర్రెను రాజు ఇంట్లోకి తీసుకెళ్లడంతో స్థానికులు హడలిపోయారు.

ఈ విషయంపై వారు పోలీసులకు సమాచారం అందించారు. కాగా, పోలీసులు వచ్చి రాజును అదుపులోకి తీసుకున్నారు. అతడిని ప్రశ్నించగా, తాను శివుడి భక్తుడ్ని అని, అందుకే పుర్రెను పూజిస్తున్నానని తెలిపాడు. మంచి జరుగుతుందన్న నమ్మకంతో ఇలా చేస్తున్నానని వివరించాడు. ఆ పుర్రెను వైద్య కళాశాల నుంచి తీసుకువచ్చినట్టు సైకో రాజు వెల్లడించాడు. గత రెండు వారాలుగా ఆ పుర్రెను పూజిస్తున్నానని వివరించాడు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు సైకో రాజును ఇవాళ కోర్టులో హాజరుపర్చనున్నారు.

ఐదేళ్ల కిందట రాజు తండ్రి రావులపూడి శ్యాం మరణించాడు. రాజు చేష్టలకు విసిగిపోయిన తల్లి యలమాజి మరో ప్రాంతానికి వెళ్లిపోయింది. అక్క కరుణ పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. దాంతో ఇంట్లో ఒంటరిగా ఉంటున్న రాజు వ్యవసనాలకు బానిసయ్యాడు. మత్తుపదార్థాలకు అలవాటు పడి, చిల్లర దొంగతనాలు కూడా చేసేవాడు.

More Telugu News