Hyderabad: హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రిలో కరోనా రోగి ఆత్మహత్య!

  • ఆత్మహత్యకు పాల్పడ్డ కరీంనగర్ కు చెందిన 60 ఏళ్ల వ్యక్తి
  • ఆసుపత్రి బాత్ రూమ్ లో ఉరి వేసుకుని బలవన్మరణం
  • కరోనా భయంతోనే ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చన్న పోలీసులు
Corona patient commits suicide in a Hyderabad private Hospital

హైదరాబాదులో దారుణం చోటుచేసుకుంది. నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే, కరీంనగర్ జిల్లాకు చెందిన 60 ఏళ్ల వ్యక్తికి  కరోనా లక్షణాలు కనిపించడంతో... కొన్ని రోజుల క్రితం కోవిడ్ పరీక్షలు చేయించుకున్నారు. రిపోర్టులో ఆయనకు పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో, స్థానిక డాక్టర్ల సలహా మేరకు హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి, చికిత్స పొందుతున్నారు.

నిన్న అర్ధరాత్రి సమయంలో ఆసుపత్రి బాత్ రూమ్ లో ఉరి వేసుకుని ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. వార్డులో ఆయన కనిపించకపోవడంతో ఆసుపత్రి సిబ్బంది చుట్టుపక్కల వెతికారు. చివరకు బాత్ రూమ్ లో ఆయన విగతజీవిగా కనిపించారు. ఈ సమాచారాన్ని ఆసుపత్రి సిబ్బంది వెంటనే పోలీసులకు అందజేశారు. హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు.

కరోనా భయంతోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. మరోవైపు మృతుడి బంధువులు మాట్లాడుతూ, ఏం జరుగుతుందో అనే భయంతో ఆయన మానసిక ఒత్తిడికి గురయ్యారని చెప్పారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News