Jodhpur Incident: ఏ కష్టమొచ్చిందో!... పాక్ నుంచి వలస వచ్చిన హిందూ కుటుంబంలో 11 మంది ఆత్మహత్య

  • జోధ్ పూర్ వలస వచ్చిన కుటుంబం
  • కౌలు సాగు చేసుకుంటూ పొట్టపోసుకుంటున్న వైనం
  • ఈ ఉదయం ఇంటిముందు విగతజీవుల్లా పడివున్న వ్యక్తులు
Eleven members dead in a migrated hindu family

పాకిస్థాన్ నుంచి భారత్ కు వలస వచ్చిన ఓ హిందూ కుటుంబంలో ఒకేసారి 11 మంది ఆత్మహత్యకు పాల్పడడం అందరినీ కలచివేస్తోంది. ఈ కుటుంబం కొన్నాళ్ల కిందట పాక్ నుంచి రాజస్థాన్ లోని జోధ్ పూర్ వలస వచ్చింది. ఆ కుటుంబానికి చెందినవారు అక్కడికి సమీపంలోని ఓ గ్రామంలో కౌలు సాగు చేసుకుంటూ పొలంలోనే నివసిస్తున్నారు. అయితే ఆదివారం ఉదయం స్థానికులు అక్కడి దృశ్యాలను చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ ఇంటి సభ్యులు విగతజీవుల్లా పడివున్నారు. దాంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా, ఒక్క వ్యక్తి కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతుండగా ఆసుపత్రికి తరలించారు. 11 మంది మరణించినట్టు గుర్తించారు. వారి శరీరాలపై గాయాలేమీ లేకపోవడంతో, ఏదైనా విషం తీసుకుని చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల మధ్య జరిగిన వివాదమే ఈ సామూహిక ఆత్మహత్యలకు దారితీసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అటు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి కోలుకుంటే ఈ ఘటనపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నా, అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

More Telugu News