India: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. 101 రక్షణ వస్తువుల దిగుమతులపై బ్యాన్

  • 'ఆత్మనిర్భర్‌ భారత్‌' కార్యక్రమానికి ప్రోత్సాహం
  • ఆయుధాలు, ఇతర రక్షణ వస్తువులు దేశీయంగానే తయారీ
  • రక్షణశాఖ తయారీ రంగాన్ని బలోపేతం చేస్తుందన్న రాజ్‌నాథ్
  • ఓ జాబితాను రూపొందించామని వెల్లడి
ban on 101 products

కేంద్ర ప్రభుత్వ 'ఆత్మనిర్భర్‌ భారత్‌' కార్యక్రమాన్ని ప్రోత్సహించేందుకు రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 101 రక్షణ వస్తువుల దిగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు ఆ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. ఆయుధాలు, ఇతర రక్షణ వస్తువులు దేశీయంగానే తయారవనున్నాయి.

తాము తీసుకున్న ఈ నిర్ణయం దేశీయంగా రక్షణశాఖ తయారీ రంగాన్ని బలోపేతం చేస్తుందని రాజ్‌నాథ్ అన్నారు. ఈ నిర్ణయం భారత రక్షణ శాఖ పరిశ్రమకు ఎంతో ఉపయోగకరమని చెప్పారు. డీఆర్‌డీవో సాంకేతిక పరిజ్ఞానానికి ఊతం ఇచ్చినట్లు అవుతుందని చెప్పారు.

దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి  భారత సైన్యం, ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమలతో చర్చించి  కేంద్ర ప్రభుత్వం ఓ జాబితాను రూపొందించిందని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. దేశీయ రక్షణ ఉత్పత్తుల కోసం 2015 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు సుమారు 3.5 లక్షల కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇచ్చినట్లు వివరించారు.

రాబోయే 6 నుంచి ఏడేళ్లలో దేశీయ పరిశ్రమకు సుమారు రూ.4 లక్షల కోట్లు ఆర్డరు ఇవ్వనున్నట్లు రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. రక్షణ శాఖ ఉత్పత్తులు దేశీయంగానే తయారీ చేస్తామని తెలిపారు. సాయుధ దళాల అవసరాలను గుర్తించి రక్షణ పరిశ్రమకు తెలియజేస్తామని అన్నారు. నిషేధం విధించిన వస్తువులను దేశీయంగా ఉత్పత్తి చేసేందుకు గడువు కూడా విధిస్తామని ప్రకటించారు.

More Telugu News