Sunnam Rajaiah: మా నాన్న చనిపోయింది కరోనాతోనే అయినా.. చంపింది కరోనా కాదు: సున్నం రాజయ్య కుమారుడు

  • కరోనా సోకిన తర్వాత జనాలు వివక్ష చూపించారు
  • ఆయన వస్తుంటే తలుపులు వేసుకునేవారు
  • వారు మాట్లాడుతూ, ధైర్యం చెప్పి ఉంటే బతికి ఉండేవారు
Corona didnt kill my father says Sunnam Rajaiahs son

భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం సీనియర్ నేత సున్నం రాజయ్య కరోనా బారిన పడి మృతి చెందిన సంగతి తెలిసిందే. పార్టీలకు అతీతంగా ఆయన మరణం పట్ల నేతలు సంతాపం ప్రకటించారు. అయితే, ఆయన కుమారుడు విడుదల చేసిన ఓ ఆడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

తన తండ్రి ఉద్యమాలే ఊపిరిగా బతికారని... అందుకే తనకు సీతారామరాజు అని పేరు పెట్టుకున్నారని తెలిపారు. కరోనా సోకిన తన తండ్రి పట్ల తమ గ్రామంలో వివక్ష చూపారని ఆవేదన వ్యక్తం చేశారు. తొలుత మా అక్కకు కరోనా సోకిందని... దీంతో, తన తండ్రిని గ్రామస్తులు అదోలా చూడటం, ఆయన వస్తున్నప్పుడు తలుపులు వేయడం చేశారని తెలిపారు. దీంతో, ఆయన మానసికంగా కృంగిపోయారని... ఆ తర్వాత ఆయనకు కూడా కరోనా పాజిటివ్ అని తేలిందని చెప్పారు. దీంతో, ఆయనలో విపరీతమైన ఆందోళన మొదలైందని... ఏం చేయాలనే ఆందోళనకు గురయ్యారని తెలిపారు.

ఎన్నో ప్రమాదాలను, రోగాలను చూసిన తన తండ్రికి కరోనా ఒక లెక్క కాదని చెప్పారు. ప్రజల కోసం పరితపించిన తన తండ్రిని... ఆ ప్రజలే దూరం పెట్టడాన్ని తట్టుకోలేకపోయారని అన్నారు. ప్రజలు పలకరిస్తూ, ధైర్యం చెప్పి ఉంటే బతికేవారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కూడా జనాల్లో కరోనాపై సరైన అవగాహన కల్పించలేదని విమర్శించారు.

More Telugu News