Indians: కరోనా సమయంలో మారుతున్న ప్రాధాన్యతలు.. జనాలు ఎక్కువగా కొంటున్నవి ఇవే!

  • సరికొత్త జీవనశైలికి అలవాటు పడుతున్న జనాలు
  • ఆరోగ్యానికి, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత
  • ఇమ్యూనిటిని పెంచుకోవడానికి ప్రాధాన్యతనిస్తున్న ప్రజలు
What Indians Have Been Spending On During Pandemic

కరోనా కారణంగా జనాలు సరికొత్త జీవవశైలికి అలవాటు పడుతున్నారు. పుట్టినప్పటి నుంచి వచ్చిన అలవాట్లను సైతం పక్కన పెట్టి ... ఆరోగ్యం కోసం సరికొత్త అలవాట్లను నేర్చుకుంటున్నారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నారు. అంతేకాదు, నెలల తరబడి కొనసాగిన లాక్ డౌన్, ఇంకా కొనసాగుతున్న కరోనా ప్రభావం కారణంతో జనాల కొనుగోళ్లలో ప్రాధాన్యతలు మారాయి. ముఖ్యంగా ఇమ్యూనిటీ బూస్టర్లు, కంఫర్ట్ ఫుడ్స్, డిజిటల్ సర్వీసెస్, గోల్డ్ లోన్స్, అప్లయెన్సెస్ కి వినియోగదారులు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు.

ఇమ్యూనిటీ బూస్టర్లు:
కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి రోగ నిరోధకశక్తిని పెంచుకోవాలనే అవగాహన ప్రజలలో పెరిగింది. దీంతో ఇమ్యూనిటి బూస్టర్లకు డిమాండ్ పెరిగింది. ఇండియా విషయానికి వస్తే ఆయుర్వేద ప్రొడక్టుల వైపు జనాలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. డాబర్, హిమాలయ తదితర కంపెనీల ఉత్పత్తుల సేల్స్ అమాంతం పెరిగాయి. ఈ కంపెనీలు అందిస్తున్న ఆమ్లా, తేనె, పంచదార, నెయ్యి, సుగంధద్రవ్యాలు, హెర్బల్ మెడిసిన్ కి గిరాకీ పెరిగింది. డాబర్ చ్యవన్ ప్రాశ్ అమ్మకాలు ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఏకంగా 700 శాతం పెరిగాయని నీల్సన్ హోల్డింగ్స్ సంస్థ తెలిపింది. బ్రాండెడ్ తేనె సేల్స్ కూడా 4 శాతం వరకు ఎగబాకాయి.

కంఫర్ట్ ఫుడ్స్:
కంఫర్ట్ ఫుడ్స్ విషయానికి వస్తే ఇన్స్టెంట్ గా వండుకునే నూడుల్స్ అమ్మకాలు పెరిగాయి. వీటిలో మ్యాగీ తన అమ్మకాల శాతాన్ని భారీగా పెంచుకుంది. రైస్, ఆయిల్ వంటి వాటిని వినియోగదారులు స్టాక్ పెట్టుకోవడానికి ప్రయత్నించడంతో... పలు చోట్ల నో స్టాక్ బోర్డులు కనిపించాయి.

డిజిటల్ సర్వీసెస్:
లాక్ డౌన్ కారణంగా వ్యవస్థ స్తంభించిపోయిన సంగతి తెలిసిందే. ఏ ఇద్దరు కలిసినా మాట్లాడుకునే పరిస్థితి లేకపోవడంతో... వ్యవస్థ మొత్తం ఆన్ లైన్ కు షిఫ్ట్ అయ్యింది. మీటింగులకు ఉపయోగపడే జూమ్ యాప్ జనాల్లోకి విపరీతంగా వెళ్లిపోయింది. బైజూస్ వంటి ఎడ్యుకేషనల్ యాప్స్ బాగా పాప్యులర్ అయ్యాయి. ఆన్ లైన్లో ల్యాప్ టాప్ ల గురించిన సెర్చ్ లు డబుల్ అయ్యాయని ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ తెలిపింది. నెట్ ఫ్లిక్స్ కు పోటీగా వచ్చిన జీ5 తన యూజర్ల సంఖ్యను భారీగా పెంచుకుంది.

గోల్డ్ లోన్స్:
కరోనా మహమ్మారి మనుషుల జీవనశైలినే కాదు... జనాల స్థితిగతులను కూడా తారుమారు చేసింది. లక్షలాది మంది ఉద్యోగాలను కోల్పోయారు. కార్మికులు ఉపాధిని కోల్పోయారు. ఈ నేపథ్యంలో, కుటుంబ పోషణకు చేతిలో చిల్లిగవ్వ కూడా లేని పరిస్థితుల్లో... జనాలకు బంగారమే అండగా నిలిచింది. దీంతో గోల్డ్ లోన్ల వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా కొనసాగుతోంది. ఇండియాలో గోల్డ్ లోన్ బిజినెస్ లో అగ్రగామిగా ఉన్న మూత్తూట్ ఫైనాన్స్ బిజినెస్ ఈ ఏడాది ఏకంగా 57 శాతం పెరిగింది.

అప్లయెన్సెన్స్:

లాక్ డౌన్ సమయంలో కూడా ఆర్థిక ఇబ్బందులు కలగని వారు చాలా మందే ఉన్నారు. ఇలాంటి వారంతా ఎప్పటి మాదిరే హోం కేర్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ ఉత్పత్తులను కొంటున్నారు.

More Telugu News