Jagan: సెప్టెంబర్ 5 నుంచి స్కూళ్లను ప్రారంభించండి: అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు

  • నాడు-నేడుపై సమీక్ష నిర్వహించిన జగన్
  • జగనన్న విద్యాకానుక కిట్లను పరిశీలించిన సీఎం
  • పాఠశాలల్లో అన్ని పనులు పూర్తి కావాలని ఆదేశం
Open schools on Sep 5 orders Jagan

కరోనా నేపథ్యంలో విద్యా సంస్థలు ఇంకా తెరుచుకోని సంగతి తెలిసిందే. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో... ఎప్పుడు తెరుచుకుంటాయో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. సెప్టెంబర్ 5న స్కూళ్లను ప్రారంభించాలని జగన్ తెలిపారు. ఈరోజు ఆయన నాడు-నేడు కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేశ్ తో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జగనన్న విద్యాకానుక కిట్లను జగన్ పరిశీలించారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, సెప్టెంబర్ 5న పాఠశాలలను ప్రారంభించాలని... ఆ సమయానికి నాడు-నేడు కార్యక్రమం కింద చేపట్టిన అన్ని పనులు పూర్తి కావాలని జగన్ చెప్పారు. ప్రతి స్కూల్లో వాల్ పెయింటింగ్స్, బొమ్మలు వేయాలని ఆదేశించారు. విద్యార్థులను ఆకట్టుకునేలా పాఠశాలలు ఉండాలని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి సురేశ్ మాట్లాడుతూ, పాఠశాలల పునఃప్రారంభానికి అన్నీ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. నాడు-నేడు కార్యక్రమం మొదటి దశ పనులు దాదాపు పూర్తయ్యాయని చెప్పారు.

More Telugu News