Sachin Pilot: ఉత్కంఠను రేపుతున్న రాజస్థాన్ రాజకీయం.. అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతామన్న సచిన్ పైలట్ టీమ్!

We will attend Assembly sessions says team Sachin Polot
షార్ట్స్‌లో చూడండి
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వరుస విన్నపాలకు స్పందించిన ఆ రాష్ట్ర గవర్నర్ కల్రాజ్ మిశ్రా... అసెంబ్లీ సమావేశాలను నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆగస్ట్ 14వ తేదీన అసెంబ్లీని సమావేశపరుస్తున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో, ఆ రోజున అశోగ్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కొనే అవకాశం ఉంది. దీంతో, రాజస్థాన్ రాజకీయాలు మరింత ఉత్కంఠభరితంగా మారాయి.

మరోవైపు, అందరి దృష్టి రెబెల్ నేత సచిన్ పైలట్ వైపు మళ్లింది. ప్రస్తుతం ఆయన శిబిరంలో ఆయనతో పాటు మరో 18 మంది రెబల్ ఎమ్మెల్యేలు ఉన్నారు. మరింత మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాగేందుకు వారు యత్నిస్తున్నారు. ఈ సందర్భంగా సచిన్ వర్గానికి చెందిన ఒక ఎమ్మెల్యే ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ, అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతామని తెలిపారు. అయితే, జైపూర్ కు ఎప్పుడు తిరిగి వెళ్లాలనే విషయంపై తాము ఇంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.

ఒకవేళ... రెబల్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోతే.... వారు ఆటోమేటిక్ గా అనర్హతకు గురవుతారు. ఎలాగైనా వీరందరినీ డిస్ క్వాలిఫై చేయాలని స్పీకర్ జోషి యత్నిస్తున్నారు. రెబల్స్ కు ఇప్పటికే అనర్హత నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో, స్పీకర్ నోటీసులపై సచిన్ పైలట్ టీమ్ రాజస్థాన్ హైకోర్టులో పిటిషన్ వేసింది.

మరోవైపు, 200 మంది ఎమ్మెల్యేలు ఉన్న రాజస్థాన్ అసెంబ్లీలో... తమకు 102 మంది ఎమ్మెల్యేల (మేజిక్ ఫిగర్ కంటే ఒకటి ఎక్కువ) మద్దతు ఉందని ముఖ్యమంత్రి గెహ్లాట్ చెపుతున్నారు. ఇంకోవైపు తమకు 30 మంది ఎమ్మెల్యేల బలం ఉందని పైలట్ వర్గం చెపుతోంది. అయితే, ఇప్పటి వరకు కేవలం 19 మందిని మాత్రమే అధికారికంగా వారు కన్ఫామ్ చేశారు.
Go Back to Shorts
Sachin Pilot
Ashok Gehlot
Rajasthan

More Telugu News