Ashok Gehlot: 21 రోజులు కాకపోతే 31 రోజులు తీసుకోమనండి... అంతిమ విజయం మాదే: అశోక్ గెహ్లాట్

  • రాజస్థాన్ లో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం
  • కాంగ్రెస్ బలపరీక్షకు అనుమతించని గవర్నర్
  • గవర్నర్ ను కలిసేందుకు వెళ్తున్న గెహ్లాట్
Final victory is ours says Ashok Gehlot

అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మూడో సారి చేసిన విన్నపాన్ని కూడా ఆ రాష్ట్ర గవర్నర్ కల్రాజ్ మిశ్రా తిరస్కరించారు. రాజస్థాన్ లో కాంగ్రెస్ అధికారం డోలాయమానంలో పడిన సంగతి తెలిసిందే. సచిన్ పైలట్ తిరుగుబాటు జెండా ఎగురవేసిన తర్వాత రాజస్థాన్ లో రాజకీయ సంక్షోభం నెలకొంది.

ప్రస్తుతానికైతే బీఎస్పీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలతో కలిపి గెహ్లాట్ ప్రభుత్వానికి... మ్యాజిక్ ఫిగర్ కంటే ఒక్క ఎమ్మెల్యే ఎక్కువ ఉన్నారు. మరోవైపు, ఎమ్మెల్యేలను లాగేందుకు ఓ వైపు సచిన్ పైలట్, మరోవైపు బీజేపీ ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు చేజారితే... కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలుతుంది. ఈ నేపథ్యంలో, అసెంబ్లీని సమావేశపరిచి... బలాన్ని నిరూపించుకుని, అధికారాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో గెహ్లాట్ ఉన్నారు. అసెంబ్లీని ఏర్పాటు చేయాలని ఇప్పటికి మూడు సార్లు గవర్నర్ కు విన్నవించారు. కానీ, ఇంత వరకు ఆయన కనికరించలేదు.

కరోనా నేపథ్యంలో ఇప్పటికిప్పుడే సమావేశాలను ఏర్పాటు చేయలేమని గవర్నర్ చెపుతున్నారు. ఎమ్మెల్యేలకు కనీసం 21 రోజుల ముందస్తు నోటీసు ఇవ్వాలని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో గవర్నర్ ను కలిసేందుకు గెహ్లాట్ రాజ్ భవన్ కు వెళ్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ, గవర్నర్ కు ఏం కావాలో తెలుసుకునేందుకు తాను రాజ్ భవన్ కు వెళ్తున్నానని చెప్పారు. 21 రోజులు కాకపోతే 31 రోజులు తీసుకున్నా పర్వాలేదని... అంతిమ విజయం తమదేనని అన్నారు.

More Telugu News