AIIMS: జ్వరమొక్కటే కరోనా ప్రధాన లక్షణం అనుకుని చాలా కేసులు మిస్ చేస్తున్నారు: ఎయిమ్స్

  • కరోనా రోగులపై ఎయిమ్స్ అధ్యయనం
  • 144 మంది రోగులపై పరిశీలన
  • 17 శాతం మందిలోనే జ్వరం ఉందని వెల్లడి
AIIMS study on corona cases tells many things

కరోనా వ్యాధి గ్రస్తులకు జ్వరం వస్తుందని, జలుబు, దగ్గు వంటి లక్షణాలు ఉంటాయన్నది ప్రజల్లో ఓ బలమైన అభిప్రాయం ఉంది. అయితే దీనిపై ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) చేపట్టిన అధ్యయనంలో ఆసక్తికర వివరాలు వెల్లడయ్యాయి.

కేవలం 17 శాతం కేసుల్లోనే జ్వరం కనిపించిందని, జ్వరమే కరోనా ప్రధాన లక్షణం అని భావించడం వల్ల అనేక కేసులను గుర్తించకుండా వదిలేస్తన్నారని ఎయిమ్స్ తన అధ్యయనంలో పేర్కొంది. తద్వారా, జ్వరం ఇతర లక్షణాలు లేని కరోనా పాజిటివ్ వ్యక్తులు సమాజంలో మరింత వ్యాప్తికి కారణమవుతున్నారని వివరించింది. 144 మంది కరోనా రోగులపై ఈ అధ్యయనం నిర్వహించారు.

కాగా, చైనాలో 44 శాతం మందికి జ్వరం కనిపించిందని, ఇక 88 శాతం మందికి ఆసుపత్రిలో చేరిన తర్వాత జ్వరం వచ్చిందని ఎయిమ్స్ వైద్య నిపుణులు పేర్కొన్నారు. మొత్తమ్మీద 44.4 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు లేకపోగా, 34.7 శాతం మందికి దగ్గు, 2 శాతం మందికి ముక్కులు కారడం వంటి లక్షణాలు కనిపించాయట.

జ్వరం, దగ్గు, గొంతునొప్పి, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు, అలసట కరోనా లక్షణాలు భావిస్తుండగా కేంద్రం వాటికి మరికొన్ని లక్షణాలను కూడా జోడించింది. వాసన, రుచి చూసే శక్తిని కోల్పోవడం, డయేరియా, కండరాల నొప్పులు కూడా కరోనా కావొచ్చంటూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కరోనా లక్షణాల జాబితాలో పేర్కొంది.

More Telugu News