Green card: నిలిచిపోయిన గ్రీన్ కార్డుల జారీ బిల్లు.. నిరసనగా వాషింగ్టన్‌లో భారతీయుల ఈక్వాలిటీ ర్యాలీ

  • గ్రీన్ కార్డుల జారీ విధానంలో మార్పులు చేసిన అమెరికా
  • నిలిచి పోయిన ‘ఫెయిర్‌నెస్ ఫర్ హై స్కిల్డ్ ఇమ్మిగ్రంట్స్ యాక్ట్’ బిల్లు
  • భారతీయులపై ద్వేషాన్ని వదులుకోవాలంటూ డెమొక్రటిక్ సెనేటర్‌కు హితవు
Indians in America protest against Democratic senator

ప్రస్తుతం ఉన్న గ్రీన్ కార్డుల జారీ విధానంలో మార్పులు తెస్తూ తీసుకొచ్చిన ‘ఫెయిర్‌నెస్ ఫర్ హై స్కిల్డ్ ఇమ్మిగ్రంట్స్ యాక్ట్’ బిల్లు నిలిచిపోవడంపై అమెరికాలోని భారతీయులు ఆందోళన వ్యక్తం చేస్తూ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. వాషింగ్టన్‌లో నిర్వహించిన ‘ఈక్వాలిటీ ర్యాలీ’లో వందలాదిమంది భారతీయులు పాల్గొన్నారు. అమెరికాలో చాలా కాలంగా ఉంటున్న ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, ఇతర ఉద్యోగులు గ్రీన్ కార్డు కోసం ఏళ్ల తరబడి నిరీక్షించాల్సి వస్తుండడంతో ఈ విధానంలో మార్పులు తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలుత వచ్చిన వారికి తొలి ప్రాధాన్యం ప్రాతిపదికన గ్రీన్ కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించింది.

ఇందుకోసం ప్రత్యేకంగా ‘ఫెయిర్‌నెస్ ఫర్ హై స్కిల్డ్ ఇమ్మిగ్రంట్స్ యాక్ట్’ పేరుతో సరికొత్త బిల్లును తీసుకొచ్చింది. అయితే, డెమొక్రటిక్ పార్టీకి చెందిన సెనేటర్ డిక్ డర్బిన్ ఈ బిల్లును వ్యతిరేకించడంతో బిల్లు ఆగిపోయింది. ఆయన తీరుకు నిరసనగా భారతీయులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. భారతీయులపై ఉన్న ద్వేషాన్ని వదులుకోవాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. దేశాభివృద్ధికి కృషి చేస్తూ ఎన్నో ఏళ్లుగా ఇక్కడే ఉంటున్న వారికి గ్రీన్ కార్డుల జారీని అడ్డుకోవడం అన్యాయమంటూ గళమెత్తారు.

ఆశ్రయం కోరుతూ దేశంలోకి అక్రమంగా వస్తున్న మైనర్లకు అన్ని హక్కులు కల్పిస్తున్నట్టుగానే చట్టబద్ధంగా దేశంలోకి వస్తున్న మైనర్లకు కూడా కల్పించాలని డిమాండ్ చేశారు. అలా చేస్తే హెచ్-1బీ వీసాదారులపై ఆధారపడి హెచ్-4 వీసా కలిగి ఉన్న పిల్లలకు నేరుగా గ్రీన్ కార్డు జారీ చేసే అవకాశం కలుగుతుందని అన్నారు.

More Telugu News