India: పొరుగు దేశాలపై వాణిజ్య యుద్ధం... కీలక చట్టానికి సవరణలు!

  • పబ్లిక్ ఫైనాన్స్ రూల్ కు సవరణలు 
  • సరిహద్దు దేశాలతో నో డీల్స్
  • గురువారం అర్ధరాత్రి ఆదేశాలు జారీ
Amendments for Public Finance Rule

చైనా, పాకిస్థాన్ వంటి ఇరుగు, పొరుగు దేశాల నుంచి అన్ని రకాల ప్రభుత్వ సంస్థలు ఏ విధమైన వస్తువులను, సేవలను అందుకునేందుకు వీల్లేదని చెబుతూ పబ్లిక్ ఫైనాన్స్ రూల్ కు సవరణలు చేస్తూ, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. జాతి భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంది. ఆ వెంటనే ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి.

"ప్రభుత్వం నేడు జనరల్ ఫైనాన్షియల్ రూల్స్ (జీఎఫ్ఆర్)2017కు సవరణలు చేసింది. ఇండియాతో సరిహద్దులను పంచుకుంటున్న దేశాల నుంచి వచ్చే కంపెనీలు ఇక్కడి కాంట్రాక్టులను పొందేందుకు ఇకపై వీలుండదు. ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా ఆ దేశాల సంస్థలతో డీల్స్ కుదుర్చుకునే అవకాశాలుండవు. పబ్లిక్ ఫైనాన్స్ కు సంబంధించిన అన్ని  విషయాలనూ ఈ చట్టం నియంత్రిస్తుంది" అని ఆర్థిక శాఖ అధికారి ఒకరు వెల్లడించారు.

అన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు, స్వతంత్ర సంఘాలకు, పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యాలు)లు తదితర ప్రభుత్వం నుంచి ఆర్థిక మద్దతు పొందే అన్ని విభాగాలకూ తాజా ఆదేశాలు వర్తిస్తాయని, రాష్ట్రాల ప్రభుత్వాలకు కూడా ఈ మేరకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ఈ మేరకు ఫైనాన్స్ మంత్రిత్వ శాఖ విభాగమైన డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎక్స్ పెండీచర్ రెండు వేర్వేరు ఆదేశాలను గురువారం రాత్రి జారీ చేసింది.

ఇండియాతో సరిహద్దులు పంచుకుంటున్న దేశాలకు చెందిన కంపెనీలతో భాగస్వామ్యాలు వద్దని తొలి ఆదేశాల్లో పేర్కొనగా.. ఇండియా రుణాలందించే సరిహద్దు దేశాలను దీని నుంచి మినహాయిస్తున్నట్టు మరో ఆదేశంలో పేర్కొన్నారు. దీని ప్రకారం, నేపాల్, భూటాన్ కంపెనీలకు మినహాయింపు లభించనుందని అధికారులు వెల్లడించారు. ఈ ఆదేశాల్లో ప్రత్యేకించి ఏ దేశం పేరునూ ప్రస్తావించక పోవడం గమనార్హం.

More Telugu News