Journalist: నడిరోడ్డు మీద జర్నలిస్టుపై కాల్పులు.. చికిత్స పొందుతూ మృతి

  • తన మేనకోడలిని వేధిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు
  • వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని అనుమానం
  • 9 మంది నిందితుల అరెస్ట్.. ఇద్దరు పోలీసులపై వేటు
Journalist who was attacked in front of daughters dies

ఘజియాబాద్‌లో సోమవారం రాత్రి దుండగులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన జర్నలిస్టు ఈ ఉదయం మరణించాడు. ఉత్తరప్రదేశ్‌లో జర్నలిస్టుగా పనిచేస్తున్న విక్రమ్ జోషి తన కుమార్తెలతో కలిసి ఇంటికి వెళ్తుండగా నడిరోడ్డుపై దుండగులు దాడిచేశారు. తుపాకులతో విచక్షణ రహితంగా కాల్చారు. జోషి తలపై బుల్లెట్ గాయాలయ్యాయి.

వెంటనే ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ ఉదయం ఆయన మృతి చెందాడు. తన మేనకోడలిని వేధిస్తున్నారంటూ ఇటీవల ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే ఈ ఘటన జరగడం గమనార్హం. యువతిని వేధించిన వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు.

ఈ కేసులో ఇప్పటి వరకు 9 మంది నిందితులను అరెస్ట్ చేయగా, ఇద్దరు పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. తమ మేనకోడలిని వేధించినవారే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని విక్రమ్ జోషి సోదరుడు ఆరోపించారు. కాగా, బైక్‌పై తన ఇద్దరు కుమార్తెలతో కలిసి వస్తున్న జోషిని అడ్డుకున్న దుండగులు ఆయనపై దాడిచేస్తున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో భయపడిన ఆయన కుమార్తెలు సాయం కోసం అర్థించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్  అయింది.

More Telugu News