Corona Virus: కరోనా వ్యాక్సిన్ ప్రజలకు ఉచితమే.. ప్రభుత్వమే ధర చెల్లిస్తుంది: సీరమ్ ఇనిస్టిట్యూట్ సీఈఓ పూనావాలా

  • సగం వ్యాక్సిన్ భారతీయులకే
  • 60 దేశాలకు ఎగుమతి చేసే ఆలోచన
  • నవంబర్ లేదా డిసెంబర్ కి లక్షల డోస్ లు సిద్ధం 
  • 2021 తొలి త్రైమాసికానికి 30 నుంచి 40 కోట్ల డోస్ లు
Corona Vaccine Free For Indians

ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీతో కలిసి అస్ట్రాజెనికా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ తొలి మానవ ప్రయోగాలు విజయవంతం అయ్యాయని లాన్సెట్ జర్నల్ లో ప్రచురితమైన మరుసటి రోజున, ఇండియాలో ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ తయారీ అనుమతులు పొందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ సీఈఓ అదార్ పూనావాలా మీడియాతో మాట్లాడుతూ, ఇక్కడ తయారయ్యే వ్యాక్సిన్ లో 50 శాతం ఇక్కడే వినియోగిస్తామని స్పష్టం చేశారు. ఇండియా నుంచి 60 దేశాలకు వ్యాక్సిన్ ఎగుమతి అవుతుందని, ఇండియాలో ప్రభుత్వమే దీన్ని కొనుగోలు చేసి, ప్రజలకు ఉచితంగా అందిస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రోగ నిరోధక శక్తిని పెంపొందించే కార్యక్రమాల్లో భాగంగానే ఇది జరుగుతుందని పూనావాలా స్పష్టం చేశారు.

కాగా, ప్రపంచంలోనే అత్యధికంగా వ్యాక్సిన్ లను తయారు చేస్తున్న సంస్థ అయిన సీరమ్ ఇనిస్టిట్యూట్ సీఈఓ, ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ, వ్యాక్సిన్ ట్రయల్స్ ఒక్కో దశా విజయవంతంగా పూర్తవుతూ ఉందని, ఒకసారి నియంత్రణా సంస్థల నుంచి అనుమతులు లభిస్తే, భారీ ఎత్తున తయారీకి తమ సంస్థ సిద్ధంగా ఉందని ఆయన అన్నారు.

"ఇక్కడ తయారయ్యే వ్యాక్సిన్ లో 50 శాతం ఇండియా కోసమే వినియోగిస్తాం. మిగతా 50 శాతం ఎగుమతి చేస్తాం. అది కూడా ప్రతి నెలా తయారయ్యే వ్యాక్సిన్ పరిమాణం ఆధారంగా ఉంటుంది. భారత ప్రభుత్వం మాకెంతో మద్దతుగా నిలుస్తోంది. ఇది ప్రపంచ కష్టమన్న విషయాన్ని మనం గుర్తించాలి. ఈ వ్యాక్సిన్ అవసరం ప్రతి ఒక్కరికీ ఉంది. ప్రపంచం మొత్తానికి మనం రక్షణ కల్పించాలి" అని ఆయన అభిప్రాయపడ్డారు.

అనుకున్న ప్రకారం ట్రయల్స్ పూర్తయి, ఫలితాలు సానుకూలంగా ఉంటే, నవంబర్ లేదా డిసెంబర్ లో కొన్ని లక్షల డోస్ లు సిద్ధమవుతాయని, 2021 తొలి త్రైమాసికం నాటికి 30 కోట్ల నుంచి 40 కోట్ల డోస్ లను సిద్ధం చేస్తామని అన్నారు. తొలి దశ వ్యాక్సిన్ ను ఎవరికి ఇవ్వాలన్న విషయంలో మాత్రం కేంద్రానిదే తుది నిర్ణయమని ఆయన అన్నారు. ఆఫ్రికా దేశాల్లో ఈ వ్యాక్సిన్ ను 2 నుంచి 3 డాలర్ల లోపే (సుమారు రూ. 150 నుంచి రూ. 230లోపు) అందించాలన్న నిశ్చయంతో ఉన్నామని తెలిపారు.

More Telugu News