Tortoise: చిలుకూరు బాలాజీ ఆలయంలో తాబేలు... మిస్టరీగా మారిన వైనం!

  • తలుపులన్నీ మూసివేసినా లోపలికి వచ్చిన తాబేలు
  • శుభసూచకం అంటున్న ప్రధాన పూజారి రంగరాజన్
  • తాబేలు వీపుపై తిరునామాలు దిద్దిన పూజారులు
Tortoise enters Chilukuru Balaji temple while all doors closed

హైదరాబాద్ శివారు ప్రాంతం చిలుకూరులో ఉన్న బాలాజీ ఆలయం ఎంత ప్రసిద్ధికెక్కిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, ఈ ఆలయంలో ఓ తాబేలు దర్శనమివ్వడం అర్చకులను విస్మయానికి గురిచేసింది. ఆలయం అన్ని తలుపులు మూసివేసినా సరే తాబేలు ఎలా ప్రవేశించిందన్నది ఓ మిస్టరీగా మారింది. దీనిపై చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన పూజారి రంగరాజన్ స్పందించారు. ఆలయంలో తాబేలు ప్రవేశించడాన్ని శుభసంకేతంగా భావిస్తున్నామని, కరోనా అంశంలో ప్రజలు త్వరలోనే మంచి వార్త వింటారన్నదానికి ఇది సూచిక అని తెలిపారు.

ఈ తాబేలును తొలుత స్థానిక శివాలయం పూజారి సురేశ్ ఆత్మారాం చూశారు. ఈ తాబేలు ఎంతో పెద్దదిగా ఉందని, లోపలికి వచ్చే మార్గాలన్నీ మూసివేసినా అది లోపలికి ఎలా వచ్చిందన్నది అంతుబట్టడంలేదని అన్నారు. కాగా, ఆలయ వర్గాలు ఆ తాబేలు వీపుపై తిరునామాలు దిద్ది పూజలు నిర్వహించారు. నాడు, క్షీరసాగర మథనంలో మహావిష్ణువు కూర్మావతారమెత్తి సహకరించాడని, ఇప్పుడు కూడా కరోనాపై పోరు సందర్భంగా ఆలయంలో కూర్మం ప్రవేశించడం ఓ దివ్యమైన సంకేతాన్నందిస్తోందని ఆలయ వర్గాలు పేర్కొన్నాయి.

More Telugu News