Rajanna Sircilla District: ఇంటికొచ్చిన భర్త.. కరోనా భయంతో రావొద్దు పొమ్మంటూ గేటుకు తాళం వేసిన భార్య

  • తెలంగాణలోని సిరిసిల్లలో ఘటన
  • ఉపాధి కరవవడంతో భివాండి నుంచి ఇంటికొచ్చిన భర్త
  • అనుమతించకపోవడంతో డబ్బులిచ్చి తిరిగి భివాండి పంపిన స్థానికులు
Wife Refused to Enter Husband into Home Amid Corona Fear

ఉపాధి కోసం మహారాష్ట్రలోని భివాండికి వెళ్లి కరోనా కారణంగా పనిలేక ఇంటికి తిరిగి వచ్చిన భర్తకు ఇంట్లో అడుగుపెట్టవద్దంటూ హుకుం జారీ చేసిందో ఇల్లాలు. తెలంగాణలోని సిరిసిల్లలో జరిగిందీ ఘటన. పట్టణానికి చెందిన నేత కార్మికుడు బతుకుదెరువు కోసం మహారాష్ట్ర వెళ్లి భివాండిలోని ఓ పరిశ్రమలో పనిచేస్తున్నాడు.

కరోనా లాక్‌డౌన్ కారణంగా పరిశ్రమ మూతపడి ఉపాధి కరవవడంతో బుధవారం తిరిగి సిరిసిల్ల చేరుకున్నాడు. ఇంటికి వచ్చిన భర్తను చూసిన అతడి భార్య సంతోషపడకపోగా, కరోనా భయంతో ఇంట్లోకి రావద్దని హెచ్చరించింది. ఇంట్లో పిల్లలు కూడా ఉన్నారని, కాబట్టి వారికేమైనా అయ్యే అవకాశం ఉందని ఆందోళన చెందిన ఆమె.. 14 రోజులు ఎక్కడైనా గడిపి ఆ తర్వాత ఇంటికి రావాలని కోరింది. అంతేకాదు, అతడు ఇంట్లోకి రాకుండా గేటుకు తాళం వేసేసింది. దీంతో అతడు గేటు ముందే కొన్ని గంటలపాటు వేచి చూశాడు. అయినా భార్య కనికరించలేదు. అతడి బాధను చూసిన స్థానికులు ఆమెకు నచ్చజెప్పినా వినిపించుకోకపోవడంతో తలా ఇన్ని డబ్బులు పోగేసి అతడికి ఇవ్వడంతో తిరిగి భివాండి వెళ్లిపోయాడు.

More Telugu News