Oxford: సత్ఫలితాలను ఇస్తున్న వ్యాక్సిన్.. నేడు శుభవార్త చెప్పనున్న ఆక్స్ ఫర్డ్!

  • ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ సత్ఫలితాలు 
  • బ్రెజిల్ లో వేలాది మందిపై ప్రయోగాలు
  • యాంటీ బాడీలు తయారైనట్టు సమాచారం
Good News Today by Oxford

ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ, ఆస్ట్రాజెనికా సంయుక్తంగా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ సత్ఫలితాలను ఇచ్చిందని తెలుస్తోంది. దాదాపు ఏడు నెలలుగా కరోనా మహమ్మారి కోరల్లో చిక్కి విలవిల్లాడుతున్న ప్రపంచ మానవాళికి నేడు ఈ శుభవార్త అధికారికంగా తెలుస్తుంది. ఇప్పటికే రెండు దశల్లో వ్యాక్సిన్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన ఆక్స్ ఫర్డ్, మూడవ దశ పరీక్షలను గత నెలలో బ్రెజిల్ లో ప్రారంభించిన సంగతి తెలిసిందే.

బ్రెజిల్ లో వేలాది మందిపై ఈ వ్యాక్సిన్ ను ప్రయోగించగా, విజయవంతం అయినట్టు తనకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందని, ఈ వార్త దాదాపుగా గురువారం నాడు బయటకు వస్తుందని ఐటీవీ పొలిటికల్ ఎడిటర్ రాబర్ట్ పెస్టన్, తన బ్లాగ్ లో వెల్లడించారు. ఈ వ్యాక్సిన్ వాడిన వారిలో యాంటీ బాడీలు, టీ-సెల్ (కరోనా వైరస్ కిల్లర్ సెల్) లను జనరేట్ చేసిందని, ఈ వ్యాక్సిన్ ప్రభావవంతమైనదేనని ఆక్స్ ఫర్డ్ నిరూపిస్తే, సెప్టెంబర్ నుంచి భారీ ఎత్తున తయారీ జరుగుతుందని ఆయన అన్నారు. 

కాగా, రాబర్డ్ పెస్టన్ తన బ్లాగ్ లో ఈ విషయాన్ని వెల్లడించగానే, లండన్ స్టాక్ మార్కెట్లో ఆస్ట్రా జెనికా ఈక్విటీ విలువ 5 శాతం లాభపడింది. ఇదిలావుండగా, కరోనాపై బ్రిటన్, చైనా, ఇండియా, యూఎస్ తదితర దేశాల్లో సుమారు 12కు పైగా రకాల వ్యాక్సిన్ లు వివిధ దశల్లో పరీక్షించబడుతున్న సంగతి తెలిసిందే.

More Telugu News