Gandhi Hospital: గాంధీ ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ నర్సులు, పారిశుద్ధ్య కార్మికుల‌ ఆందోళన.. ఇబ్బందులు పడుతోన్న రోగులు

  • జీతాల పెంపు, ఉద్యోగాల క్రమబద్ధీకరణకు డిమాండ్
  • విధులు బహిష్కరించిన వైనం
  • తాము ప్రాణాలను ఫణంగా పెట్టి పనిచేస్తున్నామని వ్యాఖ్య
  • తమ సేవలను సర్కారు గుర్తించట్లేదని ఆందోళన

కరోనా రోగులు, అనుమానితుల తాకిడి అధికంగా ఉన్న సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్‌ ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు, భద్రతా సిబ్బంది ఆందోళనకు దిగడంతో వైద్య సేవలు నిలిచిపోయి రోగులు ఇబ్బందులు పడుతున్నారు. జీతాలను పెంచడంతో పాటు తమ ఉద్యోగాల క్రమబద్ధీకరణ వంటి వాటిని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు ఆందోళనకు దిగారు.

వివిధ విభాగాలకు చెందిన కార్మికులు విధులు బహిష్కరించి, రోడ్డుపై బైఠాయించడంతో గాంధీ ఆసుపత్రి వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. తమ సమస్యలు పరిష్కరించాలని తాము ఇప్పటికే చాలా సార్లు విన్నవించుకున్నప్పటికీ అధికారులు పట్టించుకోవట్లేదని వారు అంటున్నారు.

కరోనా విజృంభిస్తోన్న సమయంలో తాము తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పనిచేస్తున్నామని అయినప్పటికీ, తమ సేవలను సర్కారు గుర్తించట్లేదని వారు అంటున్నారు. తాము 14 ఏళ్లుగా పనిచేస్తున్నప్పటికీ కేవలం రూ.17,500 మాత్రమే ఇస్తున్నారని ఔట్‌ సోర్సింగ్‌ నర్సులు అంటున్నారు. కొత్తగా చేరిన వారికి మాత్రం రూ.25 వేల జీతం ఇస్తున్నారని వాపోయారు. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.

More Telugu News