Andhra Pradesh: అప్పుల్లో పోటీపడుతున్న తెలుగు రాష్ట్రాలు.. పెరిగిపోతున్న భారం

Telugu states competing in debts
  • తెలంగాణపై 38 శాతం, ఏపీపై 42 శాతం పెరిగిన రుణభారం
  • తెలంగాణ   స్థూల రుణం ఈ ఏడాది రూ. 48 వేల కోట్లకు చేరే అవకాశం 
  • ఈ ఏడాది మార్చి నుంచి మే మధ్య రూ. 10 వేల కోట్లు అప్పు చేసిన ఏపీ

తెలుగు రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. 2018-19 తో పోలిస్తే గతేడాది తెలంగాణపై అప్పుల భారం 38 శాతం పెరగ్గా, ఏపీపై 42 శాతం పెరిగింది.  తెలంగాణ రాష్ట్రం ఈ ఏడాది ఇప్పటి వరకు తీసుకున్న దానిని బట్టి మొత్తం ఆర్థిక సంవత్సరంలో స్థూల రుణం రూ. 48 వేల కోట్లకు, నికర రుణం రూ. 40,500 కోట్లకు చేరే అవకాశం ఉంది.

ఇక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2018-19 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2019-20 ఆర్థిక సంవత్సరంలో బహిరంగ మార్కెట్ నుంచి సేకరించిన స్థూల రుణం 42.10 శాతం, నికర రుణం 42.47 శాతం పెరిగింది. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నెలకు సగటున రూ. 3,333 కోట్ల చొప్పున రూ. 10 వేల కోట్ల స్థూల రుణం తీసుకోగా, ఇందులో నికర రుణం వాటా రూ. 8,250 కోట్లు.

ఫలితంగా గతేడాది 9వ స్థానంలో ఉన్న తెలంగాణ ఈసారి ఆరోస్థానానికి ఎగబాకగా, ఆరో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఏకంగా మూడో స్థానానికి చేరుకున్నట్టు భారతీయ రిజర్వు బ్యాంకు నిన్న విడుదల చేసిన వివరాలను బట్టి తెలుస్తోంది.

గత ఆర్థిక సంవత్సరంలో రూ. 67,453 కోట్ల స్థూల రుణం, రూ. 50,494 కోట్ల నికర రుణంతో ఉత్తరప్రదేశ్‌ అప్పుల్లో అగ్రస్థానంలో నిలవగా, ఆ తర్వాత వరుసగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.

  • Loading...

More Telugu News