Pakistan: తీరు మార్చుకోని పాకిస్థాన్... ఉగ్రవాది బ్యాంకు ఖాతా పునరుద్ధరణ

  • హఫీజ్ సయీద్ బ్యాంకు ఖాతాకు మోక్షం
  • మరో నలుగురి ఉగ్రవాదుల ఖాతాలు కూడా పునరుద్ధరణ
  • ముంబయి పేలుళ్ల కుట్రధారి హఫీజ్ సయిదే!
Pakistan shows mercy on Hafiz Saeed

ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ అంతర్జాతీయ సమాజం ఎంత హితవు పలికినా పాకిస్థాన్ వైఖరిలో మార్పు రావడంలేదు. ముంబయి పేలుళ్ల సూత్రధారి, జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ బ్యాంకు ఖాతాను పునరుద్ధరించింది. తద్వారా ఆ కరడుగట్టిన ఉగ్రవాదికి ఆర్ధిక వెసులుబాటు కల్పించింది. హఫీజ్ సయీద్ తో పాటు మరో నలుగురు అనుచరుల ఖాతాలను కూడా పాక్ ప్రభుత్వం పునరుద్ధరించింది. వీరు ఉగ్రవాదులకు డబ్బు చేరవేసిన కేసులో జైల్లో ఉన్నారు.

ఐక్యరాజ్యసమితి హఫీజ్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రవేసింది. అమెరికా అతడిపై 10 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది. అయినప్పటికీ పాకిస్థాన్ ప్రభుత్వం అతడిపై కరుణ చూపడం ఆ దేశ కుట్రపూరిత ధోరణికి నిదర్శనం. అతడి బ్యాంకు ఖాతాను పునరుద్ధరించడం అంటే ఓ ఉగ్రవాద సంస్థకు నిధులు మళ్లించడమేనని భావించాలి. ఉగ్రవాదులకు డబ్బు చేరవేశారన్న కేసులో హఫీజ్ సయీద్ ను గతేడాది జూలై 17న అరెస్టు చేయగా, యాంటీ టెర్రరిజం కోర్టు 11 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం లాహోర్ లోని హైసెక్యూరిటీ జైలు కోట్ లఖ్ పత్ లో శిక్ష అనుభవిస్తున్నాడు.

More Telugu News