Maniratnam: 'పొన్నియన్ సెల్వన్' షూటింగుకి మణిరత్నం ఏర్పాట్లు

  • చారిత్రాత్మక కథా చిత్రంగా 'పొన్నియన్ సెల్వన్'
  • లాక్ డౌన్ కి ముందు ఆర్ఎఫ్సీలో షూటింగ్
  • సెప్టెంబర్ నుంచి తదుపరి చిత్రీకరణ
  • విక్రం, ఐశ్వర్య రాయ్ లపై సన్నివేశాల షూట్
Maniratnam to start shoot for Ponniyan Selvan

ప్రముఖ దర్శకుడు మణిరత్నం గురించి ఈవేళ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ తరహా సినిమా చేసినా దానిపై ఆయన బ్రాండ్ కచ్చితంగా వుంటుంది. తమిళ సినిమాకి కొత్త దారిని చూపించిన ఆయన సినిమా వస్తోందంటే ప్రేక్షకులలో ఇప్పటికీ ఓ ఉత్సుకత వుంటుంది. తాజాగా ఆయన పొన్నియన్ సెల్వన్' అనే చారిత్రాత్మక కథా చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

లాక్ డౌన్ కి ముందు ఈ చిత్రానికి సంబంధించిన కొంత షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరిగింది. అయితే, లాక్ డౌన్ కారణంగా షూటింగ్ నిలిచింది. తదుపరి షెడ్యూలును సెప్టెంబర్ నుంచి నిర్వహించడానికి ఇప్పుడు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తక్కువ మంది యూనిట్ సభ్యులతో నిర్వహించే ఆ షెడ్యూల్ లో  హీరో విక్రమ్, హీరోయిన్ ఐశ్వర్యరాయ్ లపై సన్నివేశాలను చిత్రీకరిస్తారని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

కల్కి కృష్ణమూర్తి రాసిన 'పొన్నియన్ సెల్వన్' అనే చారిత్రాత్మక నవలను అదే పేరిట మద్రాస్ టాకీస్-లైకా ప్రొడక్షన్స్ సంయుక్త నిర్మాణంలో మణిరత్నం తెరకెక్కిస్తున్నారు. సుమారు 200  కోట్ల బడ్జెట్టుతో నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేస్తారు. ఏఆర్ రెహ్మాన్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నారు.

More Telugu News