Hyderabad metro: లాక్‌డౌన్‌తో హైదరాబాద్ మెట్రో కుదేలు.. రూ. 200 కోట్లకు చేరువలో నష్టాలు!

  • లాక్‌డౌన్ కారణంగా మార్చి 22 నుంచి నిలిచిపోయిన సేవలు
  • రైళ్లు, స్టేషన్ల నిర్వహణ, జీతభత్యాల కోసం నెలకు రూ. 50 కోట్ల ఖర్చు
  • నష్టాలు చెల్లించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ
Hyderabad metro running in Rs 200 crore losses

లాక్‌డౌన్ కారణంగా మార్చి 22 నుంచి పట్టాలెక్కని హైదరాబాద్ మెట్రో క్రమంగా నష్టాల్లో కూరుకుపోతోంది. సర్వీసులు నిలిచిపోయినా రైళ్లు, స్టేషన్ల నిర్వహణ వ్యయం నెలకు రూ. 50 కోట్ల వరకు అవుతోంది. ఫలితంగా ఈ నెలాఖరు నాటికి మెట్రో నష్టం రూ. 200 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో సర్వీసుల పునఃప్రారంభానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే రైళ్లు కదలాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మెట్రోకు అనుమతి ఇవ్వడం దాదాపు అసాధ్యమేనని చెబుతున్నారు.

నిజానికి మెట్రో ఇప్పటి వరకు లాభాలు ఆర్జించినదీ లేదు, అలాగని నష్టపోయిందీ లేదు. నగరంలోని మూడు మార్గాల్లో కలిపి రోజుకు సగటున 4.5 లక్షల మంది ప్రయాణించేవారు. దీంతో వచ్చే ఆదాయం అక్కడికక్కడికి సరిపోయేది. అయితే, లాక్‌డౌన్ కారణంగా మార్చి 22 నుంచి సేవలు నిలిచిపోయాయి. సర్వీసులు లేకపోయినా రైళ్లు, స్టేషన్ల నిర్వహణ, సిబ్బంది జీత భత్యాలు తప్పనిసరి కావడంతో అందుకు నెలకు రూ. 50 కోట్ల వరకు ఖర్చు చేస్తోంది.

ఇది సంస్థకు పెను భారంగా మారడంతో కొవిడ్ కారణంగా జరిగిన నష్టాన్ని భరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి మెట్రో ఉన్నతాధికారులు లేఖ రాసినట్టు తెలుస్తోంది. నిజానికి మెట్రోకు ప్రయాణికుల నుంచి 45 శాతం మాత్రమే ఆదాయం రాగా, 50 శాతం వాణిజ్య స్థలాలు, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, రవాణా ఆధారిత ప్రాజెక్టుల అభివృద్ధి ద్వారా వస్తుంది. మిగతా ఐదు శాతం మాత్రం వాణిజ్య ప్రకటనల  ద్వారా వస్తుంది. అయితే, గత నాలుగు నెలలుగా ఇవేవీ లేకపోవడంతో మెట్రో నష్టాల బారిన పయనిస్తోంది.

More Telugu News