Vikas dubey: గ్యాంగ్‌స్టర్ వికాశ్ దూబే అనుచరుడిని మట్టుబెట్టిన పోలీసులు

  • ఈ ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతం
  • మోస్ట్ వాంటెడ్ జాబితాలో అమర్ దూబేదే తొలి పేరు
  • అతడి తలపై రూ. 25 వేల రివార్డు
Close aide of Vikas Dubey killed in encounter in Hamirpur

ఉత్తరప్రదేశ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ వికాశ్ దూబేకు అత్యంత సన్నిహితుడైన అతడి అనుచరుడు అమర్ దూబేను పోలీసులు మట్టుబెట్టారు. కాన్పూరులో 8 మంది పోలీసులను హతమార్చిన తర్వాత వికాశ్ దూబే సహా అతడి గ్యాంగ్ పరారీలో ఉంది. దూబే కోసం 40 ప్రత్యేక పోలీసు బృందాలు 100 ప్రాంతాల్లో గాలిస్తున్నాయి. కాగా, హమీర్‌పూర్ జిల్లాలోని మౌదాహాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అమర్ దూబేను పోలీసులు కాల్చి చంపారు. అమర్ దూబే కూడా హిస్టరీ షీటరేనని, వాంటెడ్ క్రిమినల్ అని పోలీసులు తెలిపారు. ఈ ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టీఎఫ్) పోలీసులు అతడిని మట్టుబెట్టినట్టు అధికారులు తెలిపారు.

కాన్పూరులో జరిగిన 8 మంది పోలీసుల ఎన్‌కౌంటర్ కేసులో అమర్ దూబే కూడా నిందితుడని పోలీసులు పేర్కొన్నారు. కాన్పూరు కేసులో పోలీసులు రూపొందించిన మోస్ట్ వాంటెడ్ జాబితాలో అమర్ దూబే పేరు తొలి స్థానంలో ఉంది. అతడి తలపై రూ. 25 వేల నగదు రివార్డు కూడా ఉన్నట్టు స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఐజీ అమితాబ్ యశ్ తెలిపారు.

More Telugu News