Telangana: రూ. 500 కోట్లు.. అత్యాధునిక హంగులు.. తెలంగాణ నూతన సచివాలయం రూపుదిద్దుకోబోతోందిలా..!

  • 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం.. ఆరు అంతస్తులు
  • ఒకేసారి 800 కార్లు పట్టేలా.. రెండు హెలికాప్టర్లు ల్యాండ్ అయ్యేలా ఏర్పాట్లు
  • ప్యాలెస్ ఆఫ్ వర్సైల్స్ భవనం స్ఫూర్తితో నిర్మాణం 
Telangana Secretariat new building works starts soon

తెలంగాణ కొత్త సచివాలయం అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకోబోతోంది. ప్రస్తుతం ఉన్న పాత సచివాలయాన్ని కూల్చేస్తున్న ప్రభుత్వం దాని స్థానంలో ఆరు అంతస్తులతో కొత్త భవనాన్ని నిర్మించబోతోంది. ఇందుకు 500 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయనుంది. ఎటువంటి వాస్తు దోషం లేకుండా ఆరు అంతస్తుల్లో అత్యంత భద్రతా ప్రమాణాలతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీర్ఘ చతురస్రాకారంలో కొత్త సచివాలయం రూపుదిద్దుకోనుంది.

మొత్తం 27 ఎకరాలున్న ఈ స్థలంలో 20 శాతాన్ని మాత్రమే భవన నిర్మాణానికి ఉపయోగిస్తుండగా, మిగిలిన ప్రదేశంలో ల్యాండ్ స్కేప్‌లు, రాష్ట్ర అధికార పుష్పమైన తంగేడు పువ్వు ఆకారంలో ఫౌంటెయిన్లు నిర్మిస్తారు. అలాగే, ఒకేసారి 800 కార్లు పార్కు చేసుకునేలా, ఒకేసారి రెండు హెలికాప్టర్లు ల్యాండ్ అయ్యేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఈ నెలాఖరులో పనులు ప్రారంభం కానున్నాయి.

రాజప్రాసాదంలా ఆకట్టుకునేలా ఉన్న భవన నమూనాను ముంబైకి చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ హఫీజ్‌ కాంట్రాక్టర్‌ డిజైన్ చేశారు. మొత్తం పది నమూనాలను పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ చివరికి దీనికి ఓకే చెప్పారు. ఫ్రాన్స్‌లోని ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్యాలెస్ ఆఫ్ వర్సైల్స్ భవనం స్ఫూర్తితో దీనిని డిజైన్ చేశారు.

More Telugu News