Jaggareddy: అదృష్టం బాగుండి కోలుకున్న వాళ్లకే హరీశ్ రావు ఫోన్ చేస్తున్నారు: జగ్గారెడ్డి విసుర్లు

  • కరోనా బాధితులకు ఫోన్ చేసిన మంత్రి హరీశ్ రావు
  • నిజంగా ఇబ్బందులు పడుతున్నవాళ్లకు ఫోన్ చేయడంలేదన్న జగ్గారెడ్డి
  • బెడ్లు, ఆక్సిజన్, వెంటిలేటర్లు లేక ఎంతోమంది ఇబ్బందిపడుతున్నారని వెల్లడి
Jaggareddy fires on Minister Harish Rao

తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఇటీవల సంగారెడ్డి జిల్లాలో కరోనా రోగులకు ఫోన్ చేసి వారి యోగక్షేమాలు విచారించారు. ఆసుపత్రిలో వారికి ఎలాంటి వైద్యసేవలు అందాయన్నదానిపై ఆయన ఆరా తీశారు. అయితే దీనిపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శలు చేశారు. అదృష్టం బాగుండి కరోనా నుంచి కోలుకుని ఇంటికి వెళ్లిన వారికే హరీశ్ రావు ఫోన్ చేసి మాట్లాడుతున్నారని అన్నారు. "ఆప్ లోగ్ కైసే హై... మంచిగున్నరా, బాగున్నరా" అంటూ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.  

కానీ, కరోనా పాజిటివ్ వచ్చి ఆసుపత్రుల్లో పోరాడుతున్నవారికి, కరోనా పాజిటివ్ వచ్చి ఆసుపత్రుల్లో బెడ్లు దొరకనివారికి హరీశ్ రావు ఫోన్ చేయడంలేదని విమర్శించారు. సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో ఆక్సిజన్, వెంటిలేటర్ల కొరత ఉందని వెల్లడించారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ఓ వెయ్యి మందికి ఆక్సిజన్, వెంటిలేటర్లు సిద్ధంగా ఉంచుకోవాలన్న ఇంగితజ్ఞానం కూడా మంత్రిగా ఉన్న హరీశ్ రావుకు లేదా? అంటూ మండిపడ్డారు. "మీకు బెడ్లు దొరుకుతున్నాయా లేదా, మీకు ఆక్సిజన్ సౌకర్యం అందుబాటులో ఉందా, వెంటిలేటర్లు ఉన్నాయా? లేదా? అని అడుగుతున్నావా హరీషూ..?" అంటూ నిలదీశారు.

More Telugu News