Chandrababu: ఇది వట్టి మాయ అయినా అయ్యుండాలి లేకపోతే కుంభకోణమైనా అయ్యుండాలి: చంద్రబాబు

  • ఏపీలో ఒక మిలియన్ కరోనా టెస్టులపై చంద్రబాబు సందేహం
  • టెస్టులు చేయించుకోని వారికీ ఎస్సెమ్మెస్ వస్తోందని వెల్లడి
  • కేంద్రం పరిశీలించాలని వినతి
Chandrababu terms one million covid tests in AP should be sham or scam

ఏపీలో పది లక్షల కరోనా టెస్టులు చేశామని వైసీపీ ప్రభుత్వం, ఆ పార్టీ నేతలు ప్రచారం చేసుకోవడంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. మొదటి నుంచి జగన్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూనే ఉందని, కరోనా పరీక్షల గణాంకాల విషయంలో కేంద్రాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు.  

"అనంతపురం నుంచి ఒక వీడియో వచ్చింది. కరోనా పరీక్షల కోసం శాంపిల్ ఇవ్వని వ్యక్తులకు కూడా కరోనా టెస్టుల్లో మీ ఫలితం ఇదీ అంటూ ఫోన్లకు సందేశాలు వస్తున్నట్టు ఆ వీడియోలో చెబుతున్నారు. ఈ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి మరీ ఇంత నీచానికి దిగజారుతుందన్న విషయం దిగ్భ్రాంతి కలిగించింది. ఏపీ సర్కారు చెబుతున్న ఒక మిలియన్ కొవిడ్ టెస్టుల గణాంకాలు వట్టి మాయ అయినా అయ్యుండాలి లేకపోతే ఓ కుంభకోణం అయినా అయ్యుండాలి. నేను కేంద్రానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను... వెంటనే ఈ విషయాన్ని పరిశీలించండి. టెస్టులు చేశామంటూ ఫోన్లకు సందేశాలు పంపే ప్రభుత్వ ప్రోద్బలిత రాకెట్ వెనుకున్న మోసపూరిత ఉద్దేశాలను బయటపెట్టండి" అంటూ చంద్రబాబు ట్విట్టర్ లో విజ్ఞప్తి చేశారు.

More Telugu News