Jagan: ఆన్ లైన్ ద్వారా ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ను ప్రారంభించిన సీఎం జగన్

  • కలెక్టర్ల ఆధ్వర్యంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాలు
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు 50 శాతం ఉద్యోగాలు
  • 'అప్కోస్' ద్వారా జీతాల చెల్లింపు
CM Jagan launches outsourcing corporation

తాను పాదయాత్ర నిర్వహించేటప్పుడు ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల కష్టాలు, సమస్యల గురించి తెలుసుకున్నానని సీఎం జగన్ అన్నారు. అందుకే వ్యవస్థలో మార్పు తీసుకువచ్చేందుకే ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేశామని తెలిపారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆన్ లైన్ ద్వారా 'అప్కోస్' (ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్స్డ్ సర్వీసెస్) ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, గతంలో కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తీసుకున్నారని, కానీ ఆ వ్యవస్థను మార్చి నియామకాల్లో పారదర్శకత తీసుకురావాలనే చర్యలు చేపట్టామని తెలిపారు.

ఎవరికీ లంచాలు ఇవ్వనవసరంలేదని, 50 శాతం ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీలు, బీసీ, మహిళలకే ఇస్తామని స్పష్టం చేశారు. జిల్లాల వారీగా కలెక్టర్లు చైర్మన్ లు గా ఉండి ఈ ఔట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాలను పర్యవేక్షిస్తారని, ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా ఉద్యోగులుగా నియమితులైన వారికి ప్రతి నెల 1వ తేదీన 'అప్కోస్' (ఏపీసీఓఎస్) ద్వారా జీతాలు చెల్లించడం జరుగుతుందని సీఎం జగన్ వివరించారు. ఈ విధానంలో లంచాలు, కమీషన్ కు తావులేనందున ఉద్యోగికి పూర్తి జీతం చేతికి అందుతుందని స్పష్టం చేశారు.

More Telugu News