Shyam K Naidu: సాయిసుధ కేసులో కెమెరామెన్ శ్యామ్ కె నాయుడి బెయిల్ రద్దు.. కొత్త కేసు నమోదు

  • పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ శ్యామ్ పై ఫిర్యాదు
  • తప్పుడు పత్రాలతో బెయిల్ పొందిన వైనం
  • ఫోర్జరీ కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించిన కోర్టు
Nampalli court cancels Cameraman Shyan K Naidu bail

టాలీవుడ్ కెమెరామెన్ శ్యామ్.కె.నాయుడుకి హైదరాబాదులోని నాంపల్లి కోర్టు షాకిచ్చింది. సినీ నటి సాయిసుధను మోసం చేశారనే కేసులో ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. వివరాల్లోకి వెళ్తే, పెళ్లి చేసుకుంటానని చెప్పి కొన్నేళ్లుగా తనతో సంబంధం పెట్టుకుని... ఇప్పుడు పెళ్లి మాటెత్తితే దాటేస్తున్నాడంటూ ఆయనపై సాయిసుధ అనే సినీనటి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత రెండు రోజులకు ఆయనకు బెయిల్ మంజూరైంది.

తాను, సాయిసుధ ఇద్దరం రాజీకొచ్చామంటూ బెయిల్ కు ఆయన దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఆయనకు బెయిల్ మంజూరైంది. అయితే, కోర్టుకు ఆయన సమర్పించిన పత్రాలు నకిలీవని కోర్టుకు సాయిసుధ తెలిపింది. దీంతో, ఆయన బెయిల్ ను కోర్టు రద్దు చేసింది. అంతేకాదు, ఫోర్జరీ కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఫోర్జరీ కేసు నమోదు చేశారు. 'అర్జున్ రెడ్డి' చిత్రం సాయిసుధ మంచి గుర్తింపును తెచ్చుకుంది.

More Telugu News