sugar: జులై నుంచి రేషన్ సరుకులపై బాదుడు.. పేదోల నెత్తిపై రూ.550 కోట్ల భారం

  • పంచదారపై 70 శాతం, కందిపప్పుపై 67.5 శాతం పెంపు
  • కిలో కందిపప్పు ఇకపై రూ.67, పంచదార కిలో రూ. 34
  • పౌరసరఫరాల శాఖకు ఆదేశాలు జారీ
govt decided to hike toor dal and sugar prices

చవక ధరల దుకాణాల ద్వారా ప్రభుత్వం అందించే రేషన్ సరుకుల ధరలు పెరగబోతున్నాయి. పంచదార, కందిపప్పు ధరలను ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వం భారీగా పెంచేసింది. కందిపప్పు ధరపై 67.5 శాతం, పంచదారపై 70 శాతం చొప్పున పెంచింది. ఫలితంగా రూ. 40 ఉన్న కందిపప్పు రూ.67కు, 20 రూపాయలు ఉన్న కిలో పంచదార రూ. 34కు పెరగనుంది. అంతేకాదు, ఇకపై మార్కెట్ ధరకు 25 శాతం మాత్రమే రాయితీ ఇవ్వాలని కూడా నిర్ణయించింది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖకు సూచించింది.

ఏడాది మొత్తం ఇవే ధరలు కనుక అమలైతే పేదలపై ఏకంగా రూ.550 కోట్ల భారం పడుతుంది. ధరల పెంపు నిర్ణయాన్ని నిజానికి ఈ ఏడాది ఫిబ్రవరిలోనే తీసుకున్నారు. ఆ తర్వాతి నెల నుంచి లాక్‌డౌన్ అమల్లోకి రావడంతో ధరల పెంపు సాధ్యం కాలేదు. మరోవైపు, లాక్‌డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజలను ఆదుకునేందుకు కేంద్రం నెలకు రెండుసార్లు చొప్పున ఆరుసార్లు బియ్యం, కందిపప్పును అందించడంతో పెంపు వీలు కాలేదు. వచ్చే నెల నుంచి  సాధారణ రేషన్ పంపిణీ మొదలు కాబోతున్న నేపథ్యంలో ధరల పెంపును అమలు చేయాలని నిర్ణయించింది.

More Telugu News