Murder: స్నేహితుల మధ్య చిచ్చు పెట్టిన సెల్‌ఫోన్.. హైదరాబాద్‌లో రౌడీ షీటర్ దారుణ హత్య

  • వినయ్ స్నేహితుడి నుంచి ఫోన్ లాక్కున్న సందీప్
  • తిరిగి ఇచ్చేయమన్నందుకు గొడవ
  • హత్య చేసి వినయ్ తల్లికి ఫోన్ చేసి చెప్పిన నిందితుడు
Rowdy sheeter murdered in Hyderabad

సెల్‌ఫోన్ విషయంలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ చివరికి హత్యకు దారితీసింది. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. గౌలిపురా అయోధ్యనగర్‌కు చెందిన రౌడీషీటర్ వినయ్ (30), రక్షాపురానికి చెందిన సందీప్ (30), సంతోష్ (28) స్నేహితులు. సందీప్ ఇటీవల వినయ్ ఫ్రెండ్ నుంచి సెల్‌ఫోన్ లాక్కున్నాడు.

విషయం తెలిసిన వినయ్ దానిని ఇచ్చేయాలని కోరాడు. ఫోన్‌ను వెనక్కి ఇచ్చేందుకు ఇష్టపడని సందీప్ విషయాన్ని తన సోదరుడు సంతోష్‌కు చెప్పాడు. దీంతో మంగళవారం ఇద్దరూ కలిసి వినయ్ ఇంటికి వెళ్లారు. అతడు లేకపోవడంతో తిరిగి వెనక్కి వెళ్లిపోయారు.

వినయ్ ఇంటికొచ్చిన తర్వాత తల్లి లలిత ద్వారా విషయం తెలుసుకుని సందీప్‌కు ఫోన్ చేసి గొడవ పడ్డాడు. సందీప్, సంతోష్‌లు దిల్‌సుఖ్‌నగర్‌లోని పీఅండ్‌టీ కాలనీలో ఉన్న విషయం తెలుసుకున్న వినయ్ బుధవారం రాత్రి ఒంటిగంట ప్రాంతంలో అక్కడికి చేరుకున్నాడు. సెల్‌ఫోన్ విషయమై అక్కడ వారి ముగ్గురి మధ్య మరోమారు గొడవ జరిగింది.

అప్పటికే మద్యం మత్తులో ఉన్న సందీప్ కత్తితో వినయ్‌ను విచక్షణ రహితంగా పొడిచాడు. తీవ్రంగా గాయపడిన వినయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం వినయ్ తల్లికి ఫోన్ చేసి విషయం చెప్పి సందీప్, సంతోష్‌లు అక్కడి నుంచి  పరారయ్యారు. వినయ్ తల్లి లలిత వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

More Telugu News