prajavedika: కరకట్ట వద్ద ఉద్రిక్తత... టీడీపీ కీలక నేతల అరెస్టు

  • ప్రజావేదిక కూల్చి ఏడాది
  • పరిశీలనకు వెళ్లిన నేతలు
  • పోలీసులు, టీడీపీ నేతలకు మధ్య వాగ్వివాదం
  • దేవినేని, వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, నక్కా ఆనందబాబు అరెస్టు  
ruckus in karakatta

గత  టీడీపీ ప్రభుత్వం నిర్మించిన ప్రజావేదికను కూల్చి నేటికి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఆ ప్రాంతానికి టీడీపీ నేతలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. దీంతో కరకట్ట వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రజా వేదికకు వెళ్లే మార్గంలో పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేసి టీడీపీ నేతలను అడ్డుకున్నారు.

కరకట్ట వద్ద ఎలాంటి నిరసనలకు అనుమతి లేదని చెప్పారు. దీంతో పోలీసులు, టీడీపీ నేతలకు మధ్య వాగ్వివాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. అలాగే, చంద్రబాబు ఇంటికి వెళ్లే మార్గాన్ని పోలీసులు మూసేశారు. దేవినేని ఉమ, వర్ల రామయ్యతో పాటు పలువురు నేతలు ఆ వైపుగా వెళ్లకుండా అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు.

అయితే, టీడీపీ నేతల వాహనాలు అక్కడ ఆగకుండా వెళ్లడంతో పోలీసులు వెంబడించి అడ్డుకున్నారు. అనంతరం దేవినేని ఉమ, వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, నక్కా ఆనందబాబులను అరెస్టు చేశారు. పోలీసులు వారిని మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

More Telugu News