పెళ్లి పేరుతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని నిండా ముంచేసిన యువతి.. 16.82 లక్షలు దోచేసిన మాయలాడి!

Woman cheated software engineer in Bengaluru
  • బెంగళూరులో పెరుగుతున్న మేట్రిమోనియల్ మోసాలు
  • వివాహిత నుంచి రూ. 7 లక్షలు కాజేసిన యువకుడు
  • నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు
పెళ్లి పేరుతో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ నుంచి రూ. 16 లక్షలకు పైగా దోచేసిందో మాయలాడి. బెంగళూరుకు చెందిన అంకుర్ శర్మ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఓ మేట్రిమోనియల్ సైట్ ద్వారా అతడికి కిరారా శర్మ అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో తరచూ ఫోన్లో మాట్లాడుకునేవారు. పెళ్లికి సంబంధించిన ఊసులు చెప్పుకునేవారు.

ఈ నేపథ్యంలో అతడికి మరింత దగ్గరైన యువతి వివిధ కారణాలు చెబుతూ అంకుర్ శర్మ నుంచి ఏకంగా రూ. 16.82 లక్షలు తీసుకుంది. ఆ తర్వాత క్రమంగా అతడిని దూరం పెట్టింది. అనంతరం ఆమె వివాహానికి ఒప్పుకోకపోవడమే కాకుండా తీసుకున్న డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదు. దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

మరో ఘటనలో ఓ వ్యక్తి మహిళను ఏడు లక్షల మేర మోసం చేశాడు. ఇది కూడా బెంగళూరు నగరంలోనే జరగడం గమనార్హం. బనశంకరికి చెందిన మహిళ (30) ఓ కంపెనీలో పనిచేస్తోంది. భర్త నుంచి విడాకులు తీసుకున్న ఆమె రెండో వివాహం కోసం ఓ మేట్రిమోనియల్ సైట్‌లో తన ప్రొఫైల్‌ను అప్‌లోడ్ చేసింది. ఈ క్రమంలో గతేడాది రమేశ్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. పరిచయం మరింత ముదిరిన తర్వాత ఆమె తనను నమ్మిందని గుర్తించిన రమేశ్ తన ప్లాన్‌ను అమలు చేశాడు.

వివిధ కారణాలు చూపుతూ రూ. 7 లక్షలు తీసుకున్నాడు. ఆ తర్వాత వేరే పనిపై మరో రాష్ట్రానికి వెళ్తున్నానని చెప్పిన రమేశ్ పత్తా లేకుండా పోయాడు. పలుమార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో తన నుంచి తీసుకున్న డబ్బులు వెనక్కి ఇవ్వాలని కోరినప్పటికీ అతడి నుంచి స్పందన లేకపోవడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Karnataka
Bengaluru
Software engineer
Cheating

More Telugu News