ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. స్టేట్ హోంలోని 57 మంది బాలికలకు కరోనా.. అందులో ఐదుగురికి గర్భం

57 girls in a state home in up infected to corona virus
  • యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న ప్రతిపక్షాలు
  • వారంతా స్టేట్ హోంకు రావడానికి ముందే లైంగిక దాడి బాధితులన్న మహిళా కమిషన్ సభ్యురాలు
  • విచారణ జరిపించాలంటూ ఎస్సెస్పీకి ఫిర్యాదు చేసిన సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు
ఉత్తరప్రదేశ్‌లోని ఓ స్టేట్‌హోంలో ఆశ్రయం పొందుతున్న 57 మంది బాలికలు కరోనా బారినపడడం, వారిలో ఐదుగురు గర్భంతో ఉన్నట్టు తెలియడంతో కలకలం మొదలైంది. కరోనా వైరస్ రాష్ట్రంలో విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇటీవల షెల్టర్ హోంలోని బాలికలకు కోవిడ్ పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల్లో 57 మంది బాలికలు కరోనా బారినపడినట్టు నిర్ధారణ అయింది. అదే సమయంలో ఐదుగురు బాలికలు గర్భంతో ఉన్నట్టు బయటపడడంతో ప్రకంపనలు మొదలయ్యాయి.

విషయం తెలిసిన మహిళా సంఘాలు, ప్రతిపక్షాలు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడుతున్నాయి. ఈ ఘటనపై సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు సుభాషిణి అలి నిన్న కాన్పూర్ ఎస్సెస్పీ దినేశ్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. షెల్టర్ హోంలోని బాలికల్లో కొందరికి గర్భం రావడం, ఒకరికి హెచ్ఐవీ పాజిటివ్, మరొకరికి హెపటైటిస్ సి ఉన్నట్టు వస్తున్న వార్తలపై విచారణ జరిపించాలని కోరారు.

గర్భం దాల్చిన వారందరూ లైంగిక దాడి బాధితులని, హోంలో చేరిన తర్వాత వారెవరూ గర్భం దాల్చలేదని  రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు పూనం కపూర్‌ పేర్కొన్నారు. వసతి గృహానికి రావడానికి ముందే బాలికలు లైంగిక దాడి బాధితులని, వారంతా అప్పటికే గర్భం దాల్చి ఉన్నట్టు కాన్పూర్ కలెక్టర్ బ్రహ్మదేవ్ రామ్ తివారీ కూడా చెప్పారు. కరోనా బాధితులను ఆసుపత్రులకు తరలించి, మిగతా వారిని క్వారంటైన్ చేసినట్టు చెప్పారు.
Go Back to Shorts
Uttar Pradesh
state home
girls
Corona Virus

More Telugu News