Lawyer: టీషర్టు ధరించి, మంచంపై పడుకుని వాదనలు వినిపించిన న్యాయవాది.. సీరియస్ అయిన న్యాయమూర్తి!

  • కరోనా నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారణలు
  • న్యాయవాది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన జడ్జి
  • వెంటనే క్షమాపణలు కోరిన లాయర్
Lawyer wears a tshirt and lying on bed attends virtual hearing

కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని న్యాయస్థానాల్లో కేసుల విచారణను వీడియో కాన్ఫరెన్స్ విధానంలో చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కొందరు న్యాయవాదులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న దాఖలాలు కనిపించాయి. ఇటీవల ఓ న్యాయవాది ఆన్ లైన్ విచారణ సందర్భంగా బనియన్ ధరించి వీడియోలో కనిపించడాన్ని న్యాయమూర్తి తీవ్రంగా ఆక్షేపించారు. తాజాగా అలాంటిదే మరో ఘటన జరిగింది. హర్యానాలోని రేవారి ఫ్యామిలీ కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసును బీహార్ లోని జెహానాబాద్ కోర్టుకు బదిలీ కోరుతూ పిటిషన్ వేయాలని ఓ న్యాయవాది ఏర్పాట్లు చేసుకున్నాడు.

జూన్ 15న పిటిషన్ వేసే క్రమంలో ఆ న్యాయవాది తన నివాసంలో టీషర్టు ధరించి, మంచంపై హాయిగా పడుకుని న్యాయమూర్తితో మాట్లాడడం ప్రారంభించాడు. దాంతో ఆగ్రహించిన న్యాయమూర్తి ఆ లాయర్ ను తీవ్రంగా మందలించారు. దాంతో తన తప్పు తెలుసుకున్న ఆ న్యాయవాది వెంటనే క్షమాపణలు కోరడంతో న్యాయమూర్తి శాంతించారు. దీనిపై న్యాయమూర్తి మాట్లాడుతూ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణల్లోనూ న్యాయవాదులు నిబంధనలు పాటించాలని, కోర్టు గౌరవ మర్యాదలు కాపాడేలా వ్యవహరించాలని హితవు పలికారు.

More Telugu News