Michigan University: జూలై 15 నాటికి భారత్ లో 8 లక్షల కరోనా కేసులు... మిచిగన్ వర్సిటీ అంచనా

  • లాక్ డౌన్ సడలింపులతో కట్టలు తెంచుకున్న కరోనా
  • మరికొన్ని వారాల్లో భారత్ లో తీవ్రస్థాయికి కరోనా
  • బ్రెజిల్ తర్వాత స్థానం భారత్ దే అవుతుందని పరిశోధకుల వెల్లడి
Michigan University tells India will be witnessed more corona cases in future

అత్యంత ప్రయాసతో నిర్వహించిన లాక్ డౌన్ ను భారత్ లో దశలవారీగా సడలిస్తుండడంతో, పర్యవసానాలు కనిపిస్తున్నాయి. కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇదిలావుంచితే, ప్రపంచ కరోనా పరిస్థితులపై అమెరికాలోని మిచిగాన్ యూనివర్సిటీ పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. జూలై 15 నాటికి భారత్ లో కరోనా తీవ్రస్థాయికి చేరుతుందని, అప్పటికి 8 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతాయని పేర్కొన్నారు.  అప్పటికి కరోనా కేసుల జాబితాలో బ్రెజిల్ తర్వాత స్థానం భారత్ దే అవుతుందని వివరించారు.

130 కోట్ల జనాభా ఉన్న దేశంలో కంటైన్మెంట్ నియమనిబంధనలు సడలించడం వల్ల భారత్ లో కరోనా రెక్కలు విప్పుకుని వ్యాపిస్తుందని తెలిపారు. భారత్ లో కరోనా విజృంభణ పీక్ స్టేజ్ కి చేరడానికి మరికొంత సమయం పడుతుందని మిచిగాన్ యూనివర్సిటీలో బయోస్టాటిస్టిక్స్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న భ్రమర్ ముఖర్జీ పేర్కొన్నారు. తాము దీర్ఘకాలిక ప్రాతిపదికన అంచనా వేసిన గణాంకాలు ఎంతో భయాందోళనలు కలిగించేలా ఉన్నాయని, అందుకే వాటిని తమ వెబ్ సైట్ నుంచి తొలగించామని ఆమె వెల్లడించారు.

ప్రస్తుతం భారత్ లో 3.43 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. 21 లక్షల కేసులతో అమెరికా అగ్రస్థానంలో ఉండగా, 8 లక్షల కేసులతో బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది. కరోనా దేశాల జాబితాలో భారత్ తాజాగా నాలుగోస్థానానికి ఎగబాకింది.

More Telugu News