Corona Virus: నా వల్ల నా కుటుంబ సభ్యులు ఇబ్బంది పడకూడదు.. కరోనా భయంతో ఐఆర్ఎస్ అధికారి ఆత్మహత్య

  • యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకున్న 56 ఏళ్ల అధికారి
  • అతడి కారులో సూసైడ్ నోట్ లభ్యం
  • పరీక్షల్లో కరోనా సోకలేదని నిర్ధారణ
IRS Officer suicided in his car in Delhi

ఢిల్లీలో దారుణం జరిగింది. కరోనా సోకిందన్న భయంతో ఓ ఐఆర్ఎస్ అధికారి తన కారులోనే యాసిడ్ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన వల్ల తన కుటుంబ సభ్యులు ఇబ్బంది పడకూడదనే ఈ తీవ్ర నిర్ణయాన్ని తీసుకున్నట్టు ఆయన రాసిన సూసైడ్ నోట్‌‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ద్వారక జిల్లాలో కారులో ఓ వ్యక్తి స్పృహ లేకుండా పడి వున్నారన్న సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్టు ధ్రువీకరించారు. బాధితుడిని ఢిల్లీకి చెందిన 56 ఏళ్ల ఐఆర్ఎస్ అధికారిగా పోలీసులు గుర్తించారు. కాగా, ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగటివ్ అని రావడం గమనార్హం. కరోనా సోకిందన్న భయంతోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన వల్ల తన కుటుంబ సభ్యులు ఇబ్బంది పడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆత్మహత్యకు ముందు ఆయన రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News