Chandrababu: ప్రలోభాలకు లొంగలేదనే పగ సాధిస్తున్నారు: చంద్రబాబు

  • హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని వెల్లడి
  • వైసీపీ దుర్మార్గాలకు అంతులేకుండా పోయిందని వ్యాఖ్యలు
  • వైసీపీ దుశ్చర్య వల్లే అచ్చెన్న ఆరోగ్యం దెబ్బతిందన్న చంద్రబాబు
Chandrababu talks to party leaders via video conference

అచ్చెన్నాయుడు అరెస్ట్ నేపథ్యంలో టీడీపీ నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసీపీ దుశ్చర్య వల్లే అచ్చెన్నాయుడి ఆరోగ్యపరిస్థితి దెబ్బతిన్నదని ఆరోపించారు. ప్రలోభాలకు లొంగలేదనే పగసాధిస్తున్నారంటూ మండిపడ్డారు. దీనిపై మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

రాష్ట్రంలో వైసీపీ దుర్మార్గాలకు అంతం లేకుండా పోయిందని, మొన్న అచ్చెన్నాయుడిపై దురాగతం చేశారని, నిన్న జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి, చింతమనేని ప్రభాకర్ లను అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యనమల, చినరాజప్పలపై తప్పుడు కేసులు బనాయించడం కక్షసాధింపు చర్యలకు పరాకాష్ట అని వ్యాఖ్యానించారు. కరోనా పేరుతో బాధితుల పరామర్శలను కూడా వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంటోందని అన్నారు. టీడీపీ నేతలపై కేసులకు, అరెస్టులకు కరోనా అడ్డురాలేదా అని ప్రశ్నించారు. 

More Telugu News