Rajesh: 24 గంటల వ్యవధిలో రెండు పెళ్లిళ్లు చేసుకున్న యువతి... నల్గొండ జిల్లాలో ఘటన!

  • శుక్రవారం పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్న మౌనిక
  • ఆ వెంటనే అక్కడికి వచ్చిన ప్రియుడు రాజేశ్
  • పెళ్లిని రద్దు చేసి, రాజేశ్ తో వివాహం జరిపించిన పెద్దలు
Two Marriages With in 24 Hours

శుక్రవారం పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్న ఓ యువతి, మరుసటి రోజున తాను మనసిచ్చిన యువకుడిని మనువాడింది. ఈ ఘటన నల్గొండ జిల్లా కనగల్ ప్రాంతంలో చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే, శాబ్దులాపురానికి చెందిన మౌనిక అనే యువతి, తన కుటుంబ సభ్యులతో కలిసి పదేళ్లుగా కురంపల్లిలో నివాసం ఉంటుండగా, ఆమెకు దేవరకొండ ప్రాంతానికి చెందిన యువకుడితో పెద్దలు పెళ్లి నిశ్చయించారు. వీరి వివాహం శుక్రవారం నాడు జరిగింది.

అయితే, తనకు వరుసకు మామయ్యే రాజేశ్ అనే యువకుడిని మౌనిక కొన్నేళ్లుగా ప్రేమిస్తోంది. మౌనిక వివాహమైన కొంత సేపటికి, ఆ ప్రాంతానికి రాజేశ్ వచ్చాడు. రాజేశ్ ను చూసిన మౌనిక, అతన్ని పట్టుకుని గట్టిగా ఏడుస్తూ, బాధపడింది. దీంతో మౌనికను వివాహమాడిన యువకుడు పెద్దల ముందు పంచాయితీ పెట్టాడు. పోలీసులు కూడా రంగంలోకి దిగారు. చర్చల తరువాత తాము పెళ్లిని రద్దు చేసుకున్నట్టు చెప్పిన మగ పెళ్లివారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో తన ప్రియుడిని వివాహమాడే అవకాశం మౌనికకు లభించింది. ఆపై శనివారం నాడు ఇక్కడి గుడిలో మౌనిక, రాజేశ్ లు మనువాడారు.

  • Loading...

More Telugu News