Locust: తెలంగాణలోకి ప్రవేశించిన మిడతలు.. కలవరపడుతున్న జనాలు!

  • మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి ప్రవేశించిన మిడతలు
  • జయశంకర్ జిల్లా మహదేవ్ పూర్ మండలంలో స్వైరవిహారం
  • బెంబేలెత్తుతున్న ప్రజలు
Locust entered into Telangana

మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోకి గత నెలలోనే ప్రవేశించిన మిడతల దండు... తాజాగా తెలంగాణలోకి ప్రవేశించింది. మహారాష్ట్ర నుంచి జయశంకర్ జిల్లా మహదేవ్ పూర్ మండలం పెద్దంపేట ప్రాంతంలోకి మిడతలు ప్రవేశించాయి. పెద్దంపేట గోదావరి పరీవాహక ప్రాంతంలో చెట్లను నాశనం చేస్తున్నాయి. దీంతో, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక్కసారిగా అలజడి చెలరేగింది.

మహారాష్ట్రలో ఉన్న మిడతలు దక్షిణ దిశలో ప్రయాణిస్తే తెలంగాణకు చేరుకుంటాయని... ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనించి, తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే, ఈలోగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోకి మిడతలు ప్రవేశించి ప్రజలను కలవరపెడుతున్నాయి. అక్కడి నుంచి ఇవి ఎటువైపు వెళ్తాయనే టెన్షన్ నెలకొంది.

More Telugu News