Chennai: నవ వధువును చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త... తొలిరాత్రే ఇద్దరికీ ఆఖరి రాత్రి!

  • చెన్నైలో దారుణ ఘటన
  • అర్థరాత్రి వేళ రక్తపుమడుగులోభార్య
  • పారిపోయి చెట్టుకు ఉరేసుకున్న భర్త
Man murders wife and commits suicide in Chennai

తమిళనాడులో దారుణమైన సంఘటన జరిగింది. చెన్నైలో ఓ యువకుడు పెళ్లయిన రాత్రే భార్యను చంపి, ఆపై తాను ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. కత్తూర్ ఏరియాలో 24 ఏళ్ల నీతి వాసన్ కు, 20 ఏళ్ల సంధ్యతో బుధవారం పెళ్లి జరిగింది. అయితే ఆ తొలిరాత్రే వారిద్దరికీ ఆఖరి రాత్రి అవుతుందని కుటుంబసభ్యులు, బంధుమిత్రులు ఎవరూ ఊహించలేకపోయారు. అర్ధరాత్రి వేళ నవదంపతుల గదిలోంచి కేకలు వినిపించడంతో కుటుంబ సభ్యులు తలుపులు తెరిచి చూడగా, సంధ్య రక్తపుమడుగులో ఉంది. అప్పటికే ఆమె ప్రాణాలు పోయాయి. పక్కనే ఓ ఇనుపరాడ్డు కనిపించడం, అక్కడే ఉండాల్సిన భర్త నీతివాసన్ లేకపోవడంతో అందరి అనుమానం అతడిపైకే మళ్లింది.

అయితే, ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నీతివాసన్ కోసం గాలిస్తుండగా, అక్కడికి దగ్గర్లోనే ఓ చెట్టుకు ఉరేసుకున్న స్థితిలో విగతజీవుడై కనిపించాడు. దాంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు. కొత్త ఆశలతో శోభనం గదిలోకి వెళ్లిన భార్యభర్తల మధ్య అసలేం జరిగిందో తెలియక కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు.

More Telugu News