Elephants: ఆస్తిలో సగభాగం భార్యకు, మిగిలిన సగం రెండు ఏనుగులకు... భర్త వీలునామా!

  • 12 ఏళ్ల వయసు నుంచి రెండు ఏనుగులను పెంచుకుంటున్న అక్తర్
  • వాటి సంరక్షణార్థం రూ. 5 కోట్ల విలువైన ఆస్తి రాసిన వైనం
  • ఏనుగులు అనాథలుగా మిగలరాదనే ఈ పని చేశానని వ్యాఖ్య
Man writes 5 cr will to elephants

తాను ఎంతో ప్రేమగా పెంచుకున్న రెండు ఏనుగుల సంరక్షణార్థం ఓ వ్యక్తి ఏకంగా తన ఆస్తిలో సగం వాటా (రూ. 5 కోట్ల విలువ) రాసిచ్చేశాడు. ఈ మేరకు వీలునామాగా రాశాడు. బీహార్ లో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... అక్తర్ ఇమామ్ అనే వ్యక్తి ఏసియన్ ఎలిఫెంట్ రిహాబిలిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్ యానిమల్ ట్రస్ట్ చీఫ్ మేనేజర్ గా ఉన్నారు. 12 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి రాణి, మోతీ అనే ఏనుగుల సంరక్షణను చూసుకుంటున్నాడు. అవి రెండు లేకపోతే జీవించలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పాడు. వేటగాళ్ల తుపాకీ దాడి నుంచి తనను ఒకసారి ఏనుగులు కాపాడాయని తెలిపారు. ఈ ఏనుగులు తన ప్రాణమని చెప్పాడు.

ఆస్తిలో సగ భాగాన్ని ఏనుగుల పేరిట రాసినందుకు తన భార్య, కొడుకు తనను వదిలి వెళ్లారని, గత పదేళ్ల నుంచి తనకు దూరంగానే ఉంటున్నారని తెలిపాడు. అంతేకాదు, తప్పుడు కేసు పెట్టి తనను జైలుకు కూడా పంపారని చెప్పాడు. అయితే, అదృష్టవశాత్తు కేసులు నిలవకపోవడంతో తాను విడుదలయ్యానని తెలిపాడు. తన కొడుకు స్మగ్లర్లతో చేతులు కలపి ఏనుగును అమ్మేందుకు ప్రయత్నించాడని... అయితే, ఆ డీల్ సక్సెస్ కాలేదని చెప్పాడు. ఏనుగుల కోసం తన ఆస్తిలో సగ భాగాన్ని రాశానని, మిగిలిన సగాన్ని భార్య పేరున రాశానని తెలిపాడు. తన తర్వాత ఏనుగులు అనాథలుగా మిగలరాదనే ఇలా చేశానని చెప్పాడు. ఒకవేళ ఏనుగులు మరణిస్తే.. ఆ ఆస్తి ఏఈఆర్ఏడబ్ల్యూఏటీ ట్రస్టుకు వెళ్లేలా వీలునామా రాశానని తెలిపాడు.

More Telugu News